Visakhapatnam Bengaluru Vande Bharat Sleeper: ఇటీవల సోషల్ మీడియాలో విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు రాబోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లో రైలుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధమైందని, త్వరలో కొత్త సర్వీస్ ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా సౌత్ కోస్ట్ రైల్వే రియాక్ట్ అయ్యింది. పలు కీలక వివరాలు వెల్లడించింది.
సౌత్ కోస్ట్ రైల్వే అధికారుల ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వివరాలు పూర్తిగా నిజం కావు. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపాలనే డిమాండ్ ఉన్న మాట నిజమే అయినప్పటికీ, అలాంటి సర్వీస్ ప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొత్త రైళ్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రైల్వే బోర్డుకే ఉంటుందన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను అధికారిక ప్రకటనలుగా భావించకూడదని సూచించారు.
వైరల్ పోస్టు ప్రకారం.. విశాఖపట్నం నుంచి నంద్యాల మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలును ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అలాగే సంబంధిత రైల్వే డివిజన్లు, జోన్ల నుంచి ఈ రూట్ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు కోరినట్లు కూడా అందులో ఉంది. అయితే, ఇది కేవలం ప్రాథమిక స్థాయి పరిశీలన మాత్రమేనని, దీనిని అధికారిక అనుమతిగా భావించడం తప్పని సౌత్ కోస్ట్ రైల్వే స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో ఒక్క వందే భారత్ స్లీపర్ రైలు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి అస్సాంలోని కామాఖ్య వరకు నడుస్తోంది. ఈ సర్వీసును 2026 జనవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ రైలును BEML తయారు చేయగా, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ రైలుకు మంచి స్పందన లభిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. భారతీయ రైల్వే దశలవారీగా మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. ఇప్పటికే బెంగళూరు-ముంబై మధ్య కూడా కొత్త వందే భారత్ స్లీపర్ సర్వీస్ ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు బెంగళూరు, హుబ్బళ్లి-ధార్వాడ్, బెలగావి, పుణే, ముంబై మధ్య ప్రయాణించే వారికి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.
అటు విశాఖపట్నం-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమాచారం అధికారికం కాదని సౌత్ కోస్ట్ రైల్వే స్పష్టం చేసింది. ఈ రూట్ పై భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అధికారం రైల్వే బోర్డుదేనని తెలిపింది. సో, అధికారిక ప్రకటన వెలువడే వరకు వైరల్ పోస్టులను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: పరిగెత్తుకొచ్చి రైలు కింద తలపెట్టిన వ్యక్తి.. మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!