Railway Constable Viral Rescue Video: ముంబై దాదర్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళా రైల్వే పోలీసు కానిస్టేబుల్ అప్రమత్తంగా వ్యవహరించి ఓ వ్యక్తి నిండు ప్రాణాలు కాపాడింది. కదులుతున్న లోకల్ రైలు కింద తలపెట్టి చనిపోవానుకున్న వ్యక్తిని క్షణాల్లో బయటకు లాగడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన జూలై 30 రాత్రి సుమారు 10:52 గంటలకు దాదర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం నంబర్ 1పై జరిగింది. బోరివాలి వైపు వెళ్లే లోకల్ రైలు ప్రయాణికులను ఎక్కించుకుని ప్లాట్ఫాం నుంచి కదలడం ప్రారంభించిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ అనితా నర్వాడే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు పఠాన్, చవాన్, హెడ్ కానిస్టేబుల్ రూపనావర్, పోలీస్ కానిస్టేబుల్ తపోలేలతో కలిసి రాత్రి విధుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి కదులుతున్న రైలు కింద తలపెట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే వాళ్లు అతడిని చూశారు.
హెడ్ కానిస్టేబుల్ అనితా నర్వాడే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రైలు పక్కకు పరుగెత్తి, కదులుతున్న బోగీల మధ్య తలపెట్టిన వ్యక్తి కాళ్లు పట్టుకుని బలంగా ప్లాట్ ఫాంపైకి లాగారు. దీంతో అతను సురక్షితంగా బయటపడగా, అక్కడున్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
🚨 A tragedy was narrowly averted at Mumbai's Dadar railway station after alert police personnel spotted a man trying to get beneath an approaching local train. They rushed in without hesitation and dragged him to safety in the nick of time, preventing a fatal accident. pic.twitter.com/Ksr9p5SXlh
— Kailash Vashi (@KailashVashi) August 2, 2026
ఈ ఘటన గురించి ముంబై సెంట్రల్ ప్రభుత్వ రైల్వే పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కట్కర్ కీలక విషయాలు వెల్లడించారు. హెడ్ కానిస్టేబుల్ అనితా నర్వాడే ఎంతో ధైర్యంగా, వేగంగా స్పందించారని తెలిపారు. ఆమె చొరవ వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు.
సీసీటీవీలో రికార్డు అయిన ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అనితా నర్వాడే చూపిన ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి పెద్ద ప్రమాదాన్నైనా ఆపవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
రైల్వే అధికారులు కూడా ప్రయాణికులు ఎలాంటి పరిస్థితుల్లోనూ కదులుతున్న రైళ్లకు దగ్గరగా వెళ్లవద్దని, ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రైల్వే పోలీసులకు, స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: నిండు ప్రాణాన్ని నిలబెట్టిన వందేభారత్, చరిత్రలో తొలిసారి రైల్లో గుండె తరలింపు!