SCR Introduces Summer Specials: వేసవి సెలవుల కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు ఎక్కువవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విశాఖపట్నం, నాందేడ్ నుంచి ఢిల్లీకి నాలుగు ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు మే 21 నుంచి మే 26 వరకు నడవనున్నాయి. సాధారణంగా వేసవిలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి ప్రయాణిస్తుంటారు. దీంతో కన్ఫర్మ్ టిక్కెట్లు దొరకడం కష్టమవుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు అదనపు రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రత్యేక రైలు(నంబర్ 08513) మే 21న సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మే 23 ఉదయం 11:40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08514 మే 24 రాత్రి 11:55 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, మే 26 రాత్రి 10:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బల్హర్షా, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా ప్రయాణికులకు కూడా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఇక నాందేడ్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రత్యేక రైలు(నంబర్ 07660) మే 22 ఉదయం 6:35 గంటలకు బయలుదేరుతుంది. ఇది మే 23 మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ రైలు 07661 మే 25 తెల్లవారుజామున 1:25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, మే 26 ఉదయం 9:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు ఆదిలాబాద్, నాగ్ పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా లాంఇ ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల ప్రయాణికులకు ఈ రైలు మంచి కనెక్టివిటీని అందించనుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లలో ప్రధానంగా స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ప్రయాణించే మధ్యతరగతి, కార్మికులు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను నడుపుతున్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే కొత్తగా ప్రకటించిన ఈ స్పెషల్ రైళ్లలో టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఈ ప్రయాణానికి సుమారు 42 గంటల సమయం పడుతుంది. నాందేడ్ నుంచి ఢిల్లీకి దాదాపు 32 గంటల ప్రయాణ సమయం ఉంటుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునేలా రైల్వే టైమింగ్స్ ను రూపొందించింది. వేసవి రద్దీ సమయంలో ఉపశమనం కలిగించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది.
Read Also: 3 గంటల్లో హైదరాబాద్- ముంబై ప్రయాణం.. బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ!