Varanasi–Siliguri Bullet Train: తూర్పు భారతంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు శరవేగంగా అడుగులు పడుతున్నారు. వారణాసి–సిలిగురి హైస్పీడ్ రైలు కారిడార్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వారణాసి నుంచి సిలిగురి వరకు ప్రస్తుతం గంటల కొద్దీ పట్టే ప్రయాణం కేవలం మూడు గంటల్లో పూర్తి కానుంది. ఈ కారిడార్ తో పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ప్రయోజనం కలగనుంది.
ఈ ప్రాజెక్ట్ లో సిలిగురి ప్రాంతానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. చికెన్స్ నెక్ లేదంటే సిలిగురి కారిడార్ గా పిలిచే ఈ ప్రాంతం దేశానికి వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈశాన్య రాష్ట్రాలకు మిగిలిన దేశంతో ఉన్న ప్రధాన భూమార్గ అనుసంధానం ఇదే. రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు ఎక్కువగా ఈ ఇరుకైన భూభాగం గుండా వెళ్తాయి. సిలిగురిని బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు ఎంపిక చేయడంతో చాలా మంది కోల్ కతాను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం సిలిగురి భౌగోళిక ప్రాముఖ్యత, భద్రతా అవసరాలు, ఆర్థిక అవకాశాలేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈశాన్య రాష్ట్రాలకు రవాణా, వాణిజ్యం మరింత సులభమవుతుందని చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ హైస్పీడ్ రైలును భవిష్యత్తులో అస్సాం రాజధాని గౌహతి వరకు విస్తరించే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తోంది. ఇది వాస్తవరూపం దాల్చితే, ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు మరింత వేగంగా లింక్ కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. సిలిగురి దేశంలో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటన్నారు మాజీ విదేశాంగ కార్యదర్శి, బీజేపీ ఎంపీ హర్ష్ వర్ధన్ శ్రింగ్లా. ఈ ప్రాంతం పశ్చిమాన నేపాల్, తూర్పున భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుందన్నారు. ఉత్తర దిశలో చైనా సరిహద్దు కూడా సమీపంలోనే ఉంటుందని చెప్పారు. అందుకే ఇక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ భద్రత పరంగా కూడా ముఖ్యమన్నారు.
ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయాన్ని భారీగా విస్తరిస్తున్నారు. దాదాపు రూ.1,549 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఒకేసారి 3,000 మంది ప్రయాణికులను మెయింటెన్ చేసే సామర్థ్యం ఉంటుంది. సంవత్సరానికి కోటి మంది ప్రయాణికులను సేవలందించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొత్త జల్పైగురి రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరిస్తున్నారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయం, భవిష్యత్తులో బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులతో సిలిగురి ప్రాంతం తూర్పు భారతంలో కీలక వాణిజ్య కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానిక వ్యాపార వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మెరుగైన కనెక్టివిటీ వల్ల పర్యాటకం, వ్యాపారం, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయని చెబుతున్నారు.
Read Also: తిరుపతి–రక్సాల్ ఎక్స్ ప్రెస్ సహా 18 రైళ్లు రద్దు.. 20 రైళ్లు మధ్యలోనే నిలిపివేత!