Railway Track Stones: దేశంలోని ఏ రైల్వే ట్రాక్ తీసుకున్నా.. చిన్న చిన్న కంకరరాళ్లతో దర్శనమిస్తుంది. అయితే రహదారుల తరహాలోనే పట్టాలను సైతం.. థార్ రోడ్డు, సిమెంట్ తో నిర్మించకుండా ఇలా రాళ్లు వేసి ఎందుకు వదిలేశారన్న సందేహాం చాలా మందికి కలిగే ఉంటుంది. ఒక వేళ పట్టాలు అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఇలా రాళ్లు వేసి ఉండొచ్చు? అని అనుకునేవారు కూడా లేకపోలేదు. అయితే పట్టాలపై కంకర రాళ్లు వేయడం వెనుక సైన్స్ దాగుందని చెప్పవచ్చు. సాంకేతిక పరిభాషలో దీనిని ‘బ్యాలస్ట్’ (Ballast) అని పిలుస్తారు. ఇంతకీ ఈ రాళ్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఒక రైలు బరువు వేల టన్నుల్లో ఉంటుంది. అంతటి భారీ బరువుతో కూడిన రైలు.. పట్టాలపై వెళ్తున్నప్పుడు, ఆ ఒత్తిడిని కేవలం పట్టాలు (Rails), వాటి కింద ఉండే సిమెంట్ దిమ్మెలు మాత్రమే తట్టుకోలేవు. కాబట్టి పట్టాలపై కంకర రాళ్లు వేయడం వల్ల అవి.. రైలు బరువును సమానంగా భూమిలోకి విస్తరింపజేస్తాయి. తద్వారా ట్రాక్ ను కుంగిపోకుండా కాపాడతాయి.
రైలు వేగంగా వెళ్లేటప్పుడు పట్టాలపై తీవ్రమైన ప్రకంపనలు (Vibrations) వస్తుంటాయి. ఈ రాళ్లు లేకపోతే ఆ వైబ్రేషన్స్ వల్ల పట్టాలు పక్కకు జరిగిపోయి ఘోర ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ రాళ్లు ఒకదానికొకటి లాక్ అయిపోయి, సిమెంట్ దిమ్మెలు, పట్టాలు అంగుళం కూడా కదలకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. అందుకే పట్టాలపై గుండ్రటి రాళ్లను కాకుండా పదునైన అంచులున్న రాళ్లను వాడతారు.
వర్షం పడినప్పుడు ట్రాక్లపై నీరు నిలిచిపోతే కింద ఉన్న మట్టి లూజ్ అయిపోతుంది. కానీ ఈ రాళ్ల మధ్య ఉండే ఖాళీల వల్ల వర్షపు నీరు అస్సలు నిలవకుండా వెంటనే కిందికి ప్రవహిస్తుంది. దీనివల్ల ట్రాక్ ఎప్పుడూ పొడిగా, బలంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Also Read:
ట్రాక్ల చుట్టూ చెట్లు, గడ్డి మొలిస్తే రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ బలహీన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టాలపై ఈ రాళ్ల పొర ఉండటం వల్ల అక్కడ ఎలాంటి మొక్కలు మొలిచే అవకాశం ఉండదు. మెుత్తంగా నిత్యం కోట్లాది మంది ప్రజలు సురక్షితంగా రైళ్లల్లో ప్రయాణించడానికి ఓ రకంగా ఈ పట్టాలపై ఉన్న ఈ రాళ్లు కూడా ఓ కారణమని చెప్పవచ్చు.