ఒకే రోజు .. రెండు మీటింగులు! ఒకరి స్పందనకు మరొకరి ప్రతి స్పందన. ఒకరి సవాళ్లకు, మరొకరి ప్రతిసవాళ్లు. షాడో సీఎంగా ఉండి పదేళ్లు పాలించింది ఒకరు. రెండున్నరేండ్లుగా సీఎంగా ఉన్నది మరొకరు. పశ్చాత్తాపం ప్రకటించాడు కేటీఆర్. పొరపాట్లు జరిగాయి.. క్షమించండి.. ఇకపై అలా చేయబోమంటూనే.. చూశారా ప్రజలారా ఎలాంటి వాడ్ని ఎన్నుకున్నారో.. ఇకనైనా బుద్దొచ్చిందా? అన్నట్టుగా మాట్లాడాడు. నీ పశ్చాత్తాపాలతో మీరు చేసిన పాపాలు కరిగిపోవు.. అవి సరిపోవు.. !వీరి మాటలు నమ్మకండి.. నమ్మి మోసపోకండని విజ్ఞప్తి చేశాడు సీఎం రేవంత్రెడ్డి.
మధ్యాహ్నం కేటీఆర్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించి.. రేవంత్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తే.. అదే రోజు సాయంత్రం దివంగత కవి, గాయకుడు అందెశ్రీ జయంతి నాడు సీఎం రేవంత్రెడ్డి.. ఆయన స్మృతి వనానికి శంఖుస్థాపన చేశాడు. ఈ వేదిక బాగా కలిసి వచ్చింది రేవంత్కు. సందర్భోచితం కూడా అని అనుకున్నట్టున్నాడు. అందుకే కడిగిపాడేశాడు. దంచి కొట్టాడు.
కేటీఆర్ సభ సక్సెసయ్యిందని సంబరపడేలోపు.. సాయంకాలమే తన గళాన్ని విప్పాడు. ఘాటుగా సమాధానాలిచ్చాడు. ఇక మీరు రారు.. మీ సంగతి అంతే.. మీకు గతమే.. భవిష్యత్ లేదని తీర్మానించేశాడు. మళ్లీ పాత కథంతా తవ్వాడు. గతాన్ని తిరగదోడాడు. చరిత్ర పుటల్ని తిప్పాడు. ఉద్యమకాలాల నాటి బలిదానాలను యాది చేశాడు. అందెశ్రీ గళాన్ని బంధించిన వైనాన్ని వివరించాడు. గద్దర్ను అవమానించిన తీరును ఎండగట్టాడు. ఉద్యమకారులు ఉసురు తీసిన వైనాన్నిముందుంచాడు.
త్యాగాల తెలంగాణలో పదేండ్ల పాపాల పాలన మీదని దుయ్యబట్టాడు. అందెశ్రీ గళానికి సంకెళ్లెశావు కదా.. అందుకే నిన్ను మేమంతా కలిసి బంధించాం.. ఇక నువ్వు అందులో నుంచి ఎలా వస్తావో చూస్తామని సవాల్ విసిరాడు. రెండు టర్ములు మేమే ఉంటాం.. ఇది చరిత్ర.. రాసి పెట్టుకోమన్నాడు. ఇక మీకిచ్చిన టర్ము పూర్తయ్యింది. మీరు రావడం కల్ల అని తేల్చి చెప్పాడు. మీకు గతమే గానీ భవిష్యత్ లేదని క్లారిటీ ఇచ్చాడు.
నిరుద్యోగులు.. కేటీఆర్ మాయ మాటలు వినొద్దని విజ్ఞప్తి చేశాడు. ప్రతీ ఖాళీని భర్తీ చేసే బాధ్యత తనదన్నాడు. పదేండ్లు అధికారమిస్తే పదవులు అనుభవించి.. ఫామ్హౌజులు కట్టుకున్నారని విమర్శించాడు. మీ జాతే అలాంటదని, మీ జాతి ఎంతుంది..? ఎక్కడుంది..? అని కేసీఆర్ కులాన్నీ వదల్లేదు. కేసీఆర్కు అహంకారం తగ్గలేదన్నాడు. ఆ పదేండ్లు స్వార్థ పాలనే కొనసాగిందని గుర్తు చేశాడు.
పదహారేండ్ల తరువాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలిచ్చింది మేమే అని వివరాలు వెల్లడించాడు. పేపర్ లీకులు చేసి కేటీఆర్ వందల కోట్లు సంపాదించాడని ఆరోపించాడు. ఏనాడైనా నిరుద్యోగుల గురించి, ప్రభుత్వ నోటిఫికేషన్ల గురించి ఆలోచించిన చరిత్ర ఆ పార్టీకున్నదా? అని మూలాలు బయటకు తీసే ప్రయత్నం చేశాడు. నీ కుటుంబం ముందు ముందు బిచ్చమెత్తుకుని బతకాల్సిందేనని శపించాడు.
నిజాం చరిత్ర ఇదే చెబుతున్నదని, నీకూ నిజాం గతే పడుతుందన్నాడు.