The Birth of Railways: ప్రపంచ రవాణా చరిత్రలో రైలు వ్యవస్థ ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైన మైలురాయి 1825 సెప్టెంబర్ 27న పడింది. అదే రోజు ప్రపంచంలో తొలి ప్యాసింజర్ రైలు ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. ఈ రైలు నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని స్టాక్ టన్- డార్లింగ్టన్ మధ్య నడిచింది. ఆ కాలంలో ఇదో పెద్ద సాంకేతిక ముందడుగుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు అప్పట్లో గంటకు 15 మైళ్ల వేగంతో పరిగెత్తింది.
ఈ రైలును నడిపిన ఇంజిన్ పేరు లోకోమోషన్ నంబర్ 1 అని పెట్టారు. ఇది ఆవిరితో నడిచేలా రూపొందించారు. దీన్ని ప్రముఖ ఇంజినీర్ జార్జ్ స్టీఫెన్సన్ రూపొందించారు. ఆయనను రైల్వే వ్యవస్థ అభివృద్ధికి చేసిన సేవల కారణంగా ఫాదర్ ఆఫర్ రైల్వేస్ గా పిలుస్తున్నారు. ఆయన ఆలోచనలు, రూపకల్పనల వల్లే ఇవాళ రైల్వే వ్యవస్థ ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది.
ప్రారంభంలో ఈ రైల్వే మార్గాన్ని ప్రధానంగా బొగ్గు రవాణా కోసం ఉపయోగించారు. ఆ సమయంలో పరిశ్రమలు వేగంగా పెరుగుతున్నందున బొగ్గు సరఫరా చాలా ముఖ్యమైంది. ఈ అవసరాన్ని తీర్చడానికి రైల్వేలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే, కొద్దికాలానికే ఈ రైలులో ప్రయాణికులను కూడా తీసుకెళ్లడం ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ రైలు సేవగా గుర్తింపు పొందింది.
స్టాక్టన్-డార్లింగ్టన్ రైల్వే ప్రారంభం తర్వాత, రవాణా రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటివరకు గుర్రపు బండ్లు, పడవలు ప్రధాన రవాణా సాధనాలుగా ఉండేవి. రైలు రావడంతో సరుకులు, ప్రజలు వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు చేరడం సులభమైంది. ఇది వ్యాపారానికి, పరిశ్రమలకు, ప్రజల జీవన విధానానికి పెద్ద ఊతంగా మారింది.
మరో ముఖ్యమైన పరిణామం 1830లో జరిగింది. ఆ సంవత్సరంలో లీవర్ పూల్ – మాంచెస్టర్ నగరాల మధ్య పూర్తిగా ఆవిరి యంత్రాలతో నడిచే తొలి పబ్లిక్ రైల్వే లైన్ ప్రారంభమైంది. ఇది పూర్తిగా ప్రయాణికుల కోసం రూపొందించబడిన వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఈ లైన్ ప్రారంభంతో రైలు ప్రయాణం మరింత ప్రజాదరణ పొందింది.
మొత్తంగా 1825లో ప్రారంభమైన మొదటి రైలు ప్రయాణం ప్రపంచ రవాణా చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఆ చిన్న ప్రారంభమే నేటి ఆధునిక రైల్వే వ్యవస్థకు పునాది అయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేగం, సౌకర్యం, భద్రత ఆ మొదటి ఆవిరి రైలుతో మొదలైన ప్రయాణానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. స్టాక్ టన్-డార్లింగ్టన్ రైల్వే కేవలం ఒక రైలుమార్గం మాత్రమే కాదు. అది ఒక కొత్త యుగానికి శ్రీకారం చుట్టిన చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు.
Read Also: 1866 నుంచి ఆగని ప్రయాణం.. దేశంలో అత్యంత పాత రైలు ఇదే!