CM Chandrababu Naidu: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నెట్వర్క్ను బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని సచివాలయంలో రహదారులు, భవనాలు (R&B), రవాణా.. జాతీయ రహదారి ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కేవలం ప్రయాణానికే కాకుండా, జాతి నిర్మాణానికి, పారిశ్రామికాభివృద్ధికి చోదకశక్తిగా మారాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పశ్చిమ భారత దేశంలో గుజరాత్ మోడల్ తరహాలోనే, ఏపీలోని తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు. మూలపేట, విశాఖ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులను కలుపుతూ, పొరుగు రాష్ట్రాల సరిహద్దులకు అనుసంధానించేలా ఈస్ట్-వెస్ట్ కారిడార్లను ప్లాన్ చేయాలని ఆదేశించారు. దీనివల్ల లాజిస్టిక్స్ వ్యయం తగ్గి, పారిశ్రామిక.. ఉద్యాన ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా చేరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖరగ్ పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా కనెక్టివిటీ పెరుగుతుందన్నారు.
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సుమారు రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ‘సాస్కీ’ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు తెలిపారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ‘పాత్ హోల్ ఫ్రీ’ (గుంతలు లేని) రహదారుల లక్ష్యంతో నిరంతర నిర్వహణ చేపట్టాలని, ముఖ్యంగా బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న ప్రాంతాల్లో వైట్ ట్యాప్ లేదా హైబ్రీడ్ మోడల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
రవాణా వ్యయాన్ని తగ్గించి, సామాన్యుడికి తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) వినియోగాన్ని పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆర్టీసీలో అన్ని కేటగిరీల్లో ఏసీ ఈవీ బస్సులనే తీసుకురావాలని, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాటరీ స్టాండర్డైజేషన్పై దృష్టి సారించాలని చెప్పారు. సోలార్ పవర్ వినియోగం ద్వారా విద్యుత్ ధరలను తగ్గించినట్లే, క్లీన్ ఫ్యూయెల్ వాడకం ద్వారా రవాణా ఖర్చులు తగ్గించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ఈ-సైకిళ్ల వినియోగాన్ని ‘మాస్ ట్రాన్స్పోర్ట్’గా మార్చేలా అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
Read Also: ఆడుదాం ఆంధ్రాలో బిగ్ స్కాం.. RS.40 కోట్ల దుర్వినియోగం, చిక్కుల్లో రోజా, బైరెడ్డి