Death Pool: ప్రపంచంలో మనకు తెలియని, ఆశ్చర్యపరిచే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఎలా ఏర్పడ్డాయో? ఎందుకు అలా ఉన్నాయో? ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. అలాంటి వింతైన ప్రదేశాల జాబితాలోకి వచ్చే ఓ భయంకరమైన ప్రదేశమే ఈ ‘పూల్ ఆఫ్ డెత్’. ఇది సాధారణ నీటి కొలను కాదు. ఇందులోకి అడుగుపెట్టిన ప్రతి జీవికి అదే చివరి రోజని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినడానికి కాస్త అతిశయంగా అనిపించినా.. ఇప్పటివరకు ఈ కొలనులోకి దిగిన ఏ ఒక్కరూ సజీవంగా బయటకు రాలేదట. ఇప్పుడీ మృత్యు కొలను కథేంటో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఉప్పుగా ఉండే సముద్రాల్లో ‘ఎర్ర సముద్రం’ ఒకటి. ఇదే సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో మియామీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాణాంతక కొలనును గుర్తించారు. సౌదీ అరేబియా తీరానికి సుమారు 5,800 అడుగుల దూరంలో ఉన్న ఈ ప్రాంతం చుట్టూ వాతావరణమే భయంకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ కొలనులోని నీరు సాధారణ సముద్ర జలాల్లా కాదు. ఇందులో ఆక్సిజన్ స్థాయి అత్యంత తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రమాదకరమైన విష రసాయనాలు కూడా ఇందులో కలిసి ఉంటాయి. ఉప్పు మోతాదు అయితే సాధారణ సముద్రం కంటే ఏకంగా 7 నుంచి 8 రెట్లు ఎక్కువ. ఈ కారణాల వల్లే ఏ జీవి ఇందులోకి వెళ్లినా బతికే అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కొలనులో చనిపోయిన జీవులు కుళ్లిపోవు. అధిక ఉప్పు శాతం వల్ల ఈ నీరు సహజ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మృతదేహాలు చాలాకాలం పాటు అలాగే ఉండిపోతాయి. ఈ లక్షణమే ఈ కొలనును మరింత భయానకంగా మారుస్తోంది.
ఇకపోతే.. ప్రకృతి సృష్టించిన ఈ పూల్ ఆఫ్ డెత్ మానవుడికి ఓ హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. అలాగే భూమ్మీద మనకు ఇంకా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి ప్రదేశాలకు వెళ్లడాని కంటే ముందు.. ఆ ప్రదేశాల గురించి రీసెర్చ్ చేయాలని, అలా చేయడం వల్ల కొంత అవగాహన ఏర్పడుతుందని చెబుతున్నారు.