Viral Video: ఉత్తర్ ప్రదేశ్ లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం వంటి తీవ్రమైన నేరారోపణలతో జైలుకు కెళ్లిన వ్యక్తిని.. బెయిల్ పై విడుదల సందర్భంగా ఘన స్వాగతం పలికారు. పూలదండలు వేసి, భుజాలపై మోస్తూ ఊరేగించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
యూపీలోని ఘజియాబాద్ కు చెందిన సుశీల్ ప్రజాపతి.. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలతో జైలుకు వెళ్లాడు. అయితే ఘజియాబాద్ జైలు నుంచి బెయిల్ పై తాజాగా విడుదలైన సుశీల్ కు అతడి మద్దతు దారులు ఘన స్వాగతం పలికారు. బంతిపూల దండలు వేసి.. భూజాలపైకి ఎక్కించుకోని ఊరేగించారు. ఏదో ఘనకార్యం చేసినట్లు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
వైరల్ అవుతున్న వీడియోలో నిందితుడు సుశీల్ ఎంతో ఆనందంగా కనిపించాడు. విజయ గర్వంతో ఆయన ఊగిపోయారు. మరోవైపు ఆయన మద్దతు దారులు చేతి వేళ్లతో వి (విక్టరీ సింబల్) గుర్తును చూపిస్తూ.. నానా హడావిడీ చేశారు. చట్టాన్ని, బాధితురాలి వేదనను హేళన చేసేలా సాగిన ఈ ఉదంతం అక్కడున్న వారిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.
A RAPIST RELEASED from JAIL is WELCOMED with flowers and slogans, hoisted on shoulders of his “supporters”
And people have the AUDACITY to get mad when I say India is a PRO RAPE COUNTRY. pic.twitter.com/Sfk18MBXhP
— The Protagonist (@protagonist_xig) May 19, 2026
ఈ ఊరేగింపుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘ఒక అత్యాచార నిందితుడికి సమాజంలో ఇంతటి గౌరవమా? మనం ఏ కాలంలో బతుకుతున్నాం?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టంపై గౌరవం లేని ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన బాధితురాలికి మరింత మానసిక క్షోభను మిగులుస్తుందని ఇది నేరస్థులను మరింత ప్రోత్సహించడమేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనతో బాధితురాలి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. జైలు నుంచి వస్తూనే ఇంతటి అట్టహాసం ప్రదర్శించిన నిందితుడు, అతని అనుచరులు.. కేసును ఉపసంహరించుకోవాలని తమపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి లభించిన ఈ రాచమర్యాదలు చూశాకా తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న భయాన్ని బాధితురాలి బంధువులు వ్యక్తం చేస్తోంది.
Also Read: సింగిల్ డోర్ Vs డబుల్ డోర్ ఫ్రిడ్జ్.. మీ లైఫ్స్టైల్కు ఏది బెస్ట్? ఓసారి చూసేయండి!
నిందితుడి ఊరేగింపు వీడియో కాస్తా వైరల్ కావడంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. బహిరంగంగా నేరస్థుడిని కొనియాడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే న్యాయవాదికి పరిచయం చేస్తాననే నెపంతో నిందితుడు సుశీల్ ప్రజాపతి.. న్యాయ విద్యార్థినిని ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 9 నెలలు తర్వాత మే 17న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
Also Read: రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్లోనే 16,000 దుకాణాలు క్లోజ్!