కేరళ రాష్ట్రంలోని అన్నమనాడ మహాదేవ ఆలయంలో ప్రతి ఏట వాలియావిళక్కు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే ఈసారి వార్షిక వేడుకల్లో భాగంగా అనూహ్యమైన ఘటన చోటుచుసుంది. దేవాలయంలో నిర్వహించే ఊరేగింపులో ఓ ఏనుగు 26 ఏళ్ల యువకుడిపై తొండంతో అటాక్ చేసింది. ఈ ఘటనలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడగా.. ఉత్సవాలకు వచ్చిన భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమనాడ మహాదేవ ఆలయంలో ఊరేగింపు కోసం సన్నద్ధతలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గజరాజును అలంకరించారు. అయితే ఏనుగు తన స్థానంలో నిలబడి ఉండగా.. ఒక వ్యక్తి దాని వెనుక భాగం నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అలంకరణ వస్తువును పట్టుకుని ఏనుగు ముందు భాగంలో నిలబడిన యువకుడిపై ఏనుగు దాడికి దిగింది. ఆ ఏనుగు ఒక్కసారిగా తొండంతో యువకుడి కాళ్లను చుట్టేసి.. తన వైపునకు లాక్కుని గాలిలోకి ఎత్తింది. అనంతరం అతడిని నేలకేసి బలంగా విసిరికొట్టింది.
ఏనుగు దాడి చేయడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని వెంటనే దగ్గరలో అంగమాలీలోని అపోలో అడ్లక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాద నేపథ్యంలో ఆలయ అధికారులు ఉత్సవాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఏనుగును ఆలయ ప్రాంగణంలోనే బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఏనుగు ప్రవర్తనను అంచనా వేయడానికి.. దానిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించడానికి ఎలిఫెంట్ స్క్వాడ్ను కూడా అధికారులు రప్పించారు. కేరళలోని ఆలయ ఉత్సవాల్లో ఏనుగులతో అలంకరించడంతో ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఉత్సవాల్లో ఉండే భారీ శబ్దాలు.. విపరీతమైన రద్దీ.. అలంకరణలు వంటివి ఏనుగులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గజరాజులు అనూహ్యంగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Elephant lifts and throws a youth during temple festival in Kerala's Thrissur 😳 pic.twitter.com/5u6zKeBV5i
— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 26, 2026
ఈ దాడికి గల అసలు కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి.. పండుగల సమయంలో ఏనుగుల నిర్వహణపై కఠినమైన భద్రతా నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: India vs Zimbabwe: టాస్ ఓడిన జింబాబ్వే…సంజు వచ్చేశాడు, టీమిండియా గెలిచేలా పిచ్ చేశారంటూ ఆరోపణలు !