మన దేశంలో ఎన్నో చిత్ర విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. అలాంటి వాటిలో ఒకదానికి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నిజానికి రాత్రిపూట నదులు, సరస్సులు, బావులలో నీళ్లు కూడా చీకటిలో అంత స్పష్టంగా కనిపించవు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో నీళ్లు మిల మిల మెరుస్తాయి. అవును మీరు విన్నది నిజమే! అక్కడ నీళ్లను కదిలిస్తే, ప్రకాశంతంగా మెరుస్తాయి. తాజాగా ఈ మెరుపు నీళ్లకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే..
ఈ వింత నీటి ప్రదేశం కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్నది. స్థానిక ప్రజలు ఈ ప్రదేశాన్ని కవరు అని పిలుస్తారు. కుంబలంగి, చెల్లనం సమీపంలోని పొక్కలి పొలాల్లో ఉంటుంది. ఇక్కడ చీకటిలో విద్యుత్ నీలి కాంతి అలలు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ట్రావెలర్ అతుల్య నంబియార్ ఓ వీడియోను షేర్ చేసింది. కొచ్చికి వెళ్లిన వాళ్లు తప్పకుండా ఈ ప్రదేశాన్ని చూడాలని చెప్పుకొచ్చింది. అర్థరాత్రి పూట తీసిన ఈ క్లిప్ లో నీటిని చేతితో పైకి వెదజల్లినా, చేతులు నీళ్లలో ఉంచి కదిలించినా, అలలు నీలి రంగులో మెరుస్తూ కనిపించాయి. ఇంకా చెప్పాలంటే ఆ అలలు నియాన్ బ్లూ రంగులో ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ ప్లేస్ గురించి పూర్తి వివరాలను వెల్లడించాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.
కవరు అనేది కేరళ తీరప్రాంత గ్రామాలకు కొత్త విషయం ఏమీ కాదు. ఇది అధిక లవణాలను కలిగిన నీటిలో ఉండే మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా, ఆల్గే, ప్లాంక్టన్, శిలీంధ్రాల వల్ల కలిగే సహజ బయోలుమినిసెన్స్. ఈ జీవులు రక్షణ యంత్రాంగంగా మారి నీలికాంతిని విడుదల చేస్తాయి. ఈ అరుదైన దృశ్యాలు ఎక్కువగా వేసవి నెలల్లో కనిపిస్తాయి. స్థానికులు దీనిని చల్లని కాంతి అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది వేడి లేకుండా మెరుపును కలిగిస్తుంది. కుంబలంగి, చెల్లనం అంతటా విస్తరించి ఉన్న పొక్కలి పొలాలలో ఈ అరుదైన మెరిసే అలలు కనిపిస్తుంటాయి.
ఈ వింత నీలిరంగు అలలు సాధారణంగా జనవరి ప్రారంభం నుంచి మే మధ్య కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అతుల్య కూడా వివరించింది. ఫిబ్రవరిలో ఇలాంటి అలలు మరింత బాగా కనిపిస్తాయని చెప్పుకొచ్చింది. స్థానికులు చంద్రకాంతి కూడా ఇలా అలలు మెరిసేందుకు కారణం అవుతాయని చెప్తారు. ప్రకాశవంతమైన రాత్రులలో కాంతి బలహీనంగా కనిపిస్తుంది. పౌర్ణమి దశ మసకబారుతున్న కొద్దీ అది మరింత కనిపిస్తుంది.
అతుల్య వీడియో నేపథ్యంలో చాలా మంది ఆ ప్రదేశానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడికి ఎలా చేరుకోవాలి? ప్రయాణ ఖర్చు ఎంత అవుతుంది? హోటల్స్ అందుబాటులో ఉంటాయా? అని ఆరా తీస్తున్నారు. కొచ్చి సమీపంలోని కుంబలంగికి చేరుకోవడానికి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకోవాలి. ఆ తర్వాత టాక్సీ తీసుకోవాలి. వసతి విషయానికి వస్తే, బడ్జెట్ హోమ్స్టేల నుంచి లే మెరిడియన్ కొచ్చి లాంటి పలు రిసార్ట్ లు ఉన్నాయి.