Jyotirlinga Vs Shivlinga: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శివుడిని లింగ రూపంలో ఆరాధించడం అత్యంత పురాతనమైన సంప్రదాయం. అయితే.. సాధారణ శివాలయాల్లో భక్తులచే ప్రతిష్ఠించబడే ‘శివలింగానికి’, దేశ వ్యాప్తంగా స్వయంభుగా వెలసిన ’12 జ్యోతిర్లింగాలకు’ మధ్య ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఎంతో వ్యత్యాసం ఉంది. శివలింగం పరమశివుడి నిరాకార తత్వానికి ప్రతీక అయితే.. జ్యోతిర్లింగం అనంతమైన కాంతి స్తంభం నుంచి ఉద్భవించిన శివుని ప్రత్యక్ష రూపం. శివలింగాలు ప్రాణ ప్రతిష్ఠ ద్వారా శక్తిని పొందితే.. జ్యోతిర్లింగాలు సహజ సిద్ధమైన దైవిక శక్తిని కలిగి ఉంటాయి. వీటి మధ్య గల నిగూఢ అంతరార్థాలను, విశిష్టతలను వివరంగా తెలుసుకుందాం.
1. శివలింగం అంటే ఏంటి ?
శివలింగం అనేది పరమశివుడి నిరాకార (రూపం లేని) తత్త్వానికి ప్రతీక. ‘లింగం’ అనే పదానికి సంస్కృతంలో ‘గుర్తు’ లేదా ‘చిహ్నం’ అని అర్థం. అనంతమైన విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడిని మనం శివలింగ రూపంలో పూజిస్తాం. శివలింగాలు సాధారణంగా మనిషి ద్వారా నిర్మించబడతాయి (మానుష లింగాలు). ఇవి రాయి, స్ఫటికం, వెండి లేదా మట్టితో చేయబడతాయి.వీటిని ఆగమ శాస్త్రాల ప్రకారం మంత్రోచ్ఛారణల ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు.
2. జ్యోతిర్లింగం అంటే ఏంటి ?
‘జ్యోతిర్లింగం’ అంటే ‘కాంతి కిరణం’ అని అర్థం. పురాణాల ప్రకారం.. జ్యోతిర్లింగాలు మానవ నిర్మితాలు కావు. పరమశివుడు స్వయంగా జ్యోతి స్వరూపంలో ఉద్భవించిన ప్రదేశాలను జ్యోతిర్లింగాలు అంటారు.
పురాణ గాథ: ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అనే వివాదంలో పడినప్పుడు, శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభంగా ఉద్భవించాడు. ఆ కాంతి స్తంభం యొక్క ఆది, అంతాలను కనుగొనలేక వారు శివుడిని శరణు వేడారు. అలా భూమిపై ఏ ప్రదేశాల్లో అయితే ఆ జ్యోతి అగ్ని స్తంభంగా నిలిచిందో.. అవే జ్యోతిర్లింగాలు.
స్వయంభూ: ఇవి ‘స్వయంభూ’ లింగాలు.. అంటే ప్రకృతి సిద్ధంగా వెలసినవి.
3. ద్వాదశ జ్యోతిర్లింగాలు:
శివపురాణం ప్రకారం ఇండియాలో 12 ముఖ్యమైన జ్యోతిర్లింగాలు ఉన్నాయి.
సోమనాథ్ (గుజరాత్)
మల్లికార్జున (ఏపీ – శ్రీశైలం)
మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్)
ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
కేదార్నాథ్ (ఉత్తరాఖండ్)
భీమశంకర్ (మహారాష్ట్ర)
కాశీ విశ్వనాథ్ (ఉత్తరప్రదేశ్)
త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర)
వైద్యనాథ్ (జార్ఖండ్)
నాగేశ్వర్ (గుజరాత్)
రామేశ్వరం (తమిళనాడు)
ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర)
Also Read: గురువారం లవంగాలతో.. ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్
ప్రతి జ్యోతిర్లింగం ఒక శివలింగమే.. కానీ ప్రతి శివలింగం జ్యోతిర్లింగం కాదు. సాధారణ శివలింగాలు భక్తుల సౌకర్యార్థం అర్చన కోసం ప్రతిష్ఠించబడతాయి. కానీ జ్యోతిర్లింగాలు పరమశివుడి తత్వానికి సజీవ సాక్ష్యాలుగా.. అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా పరిగణించబడతాయి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.