Lottery Winner Missing: అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్లోని బర్నాలాలో కేవలం 50 రూపాయలతో లాటరీ టికెట్ కొన్న ఒక సామాన్యుడిని 30 లక్షల రూపాయల జాక్పాట్ వరించింది. అయితే, విజేత ఎవరో తెలియకపోవడంతో నిర్వాహకులు డప్పులు, మైకులతో వీధుల్లో గాలిస్తుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పంజాబ్ రాష్ట్రం బర్నాలా రైల్వే స్టేషన్ సమీపంలోని లాటరీ విక్రేత జై శంకర్ వద్ద విక్రయించిన ‘రాజ్ శ్రీ మాసిక లాటరీ’ టికెట్కు ఈ బంపర్ ప్రైజ్ లభించింది. అయితే, బహుమతి ప్రకటించి రోజులు గడుస్తున్నా విజేత మాత్రం తన ఇనామ్ తీసుకోవడానికి ఇంతవరకు ముందుకు రాలేదు.
తమ వద్ద టికెట్ కొని లక్షాధికారి అయిన ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవడానికి ఏజెంట్ జై శంకర్ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. బజారులో లౌడ్స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేయిస్తూ, డప్పులు వాయిస్తూ విజేత కోసం గాలిస్తున్నారు. లూథియానాకు చెందిన రాజ్ శ్రీ కంపెనీ ప్రతినిధి రాజ్ కుమార్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెలవారీ లాటరీ ఫలితాలను ఫిబ్రవరి 26న ప్రకటించారు. కేవలం 50 రూపాయలు పెట్టి కొన్న టికెట్కు ఈ భారీ అదృష్టం వరించింది.
మొత్తం 5 లక్షల లాటరీ టికెట్లలో బర్నాలాకు చెందిన ఈ వ్యక్తి ప్రథమ స్థానంలో నిలిచి 30 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా కూడా విజేతను కనిపెట్టేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదృష్టం తలుపు తట్టినా ఆ వ్యక్తి తన బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి రాకపోవడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చాంశనీయంగా మారింది.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టం తలుపు తట్టినా ఆ వ్యక్తికి ఇంకా విషయం తెలియకపోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బర్నాలా రైల్వే స్టేషన్ పరిసరాల్లో టికెట్ కొన్న వారు ఎవరైనా ఉంటే వెంటనే తమ టికెట్ నంబర్లను సరిచూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బహుశా ఆ టికెట్ కొన్న వ్యక్తికి తాను గెలిచానన్న విషయం తెలియక టికెట్ను ఎక్కడైనా పడేసి ఉండవచ్చని లేదా నిర్లక్ష్యంగా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ అదృష్టవంతుడు గడువులోగా వచ్చి తన సొమ్మును దక్కించుకుంటాడో లేదో వేచి చూడాలి.
Read Also: Shreya Ghoshal: అసలు అమ్మాయిలు ఎక్కడున్నారు.. ఉమెన్స్ డే రోజు వైరల్ అవుతున్న శ్రేయ ఘోషల్ ఆవేదన..!