Rajasthan Jail Marriage: ప్రేమ ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుడుతుందో ఎవరూ ఊహించలేరు. మనసు కలిస్తే చాలు.. వయసు, మతం, వృత్తి మాత్రమే కాదు, వారు ఉన్న పరిస్థితులు కూడా అడ్డుకావని ఈ ఉదంతం నిరూపిస్తోంది. కఠినమైన జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు కిరాతక హంతకులు, జైలు గోడల మధ్యే ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాలుగు గోడల మధ్య మొదలైన వీరి పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్లడమే కాకుండా, వీరి వివాహం కోసం సాక్షాత్తూ హైకోర్టు 15 రోజుల పెరోల్ మంజూరు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మోడల్ ప్రియా సేథ్, మరో ఖైదీ హనుమాన్ ప్రసాద్ జైలు గోడల మధ్య ఒకరినొకరు కలుసుకున్నారు. వీరిద్దరూ అల్వార్లోని సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు ఆరు నెలల క్రితం వీరి పరిచయం ప్రేమగా మారింది. తాజాగా వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, రాజస్థాన్ హైకోర్టు వీరికి 15 రోజుల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది. నేడు (జనవరి 23, 2026) అల్వార్లోని బరోడమెవ్లో వీరి వివాహం జరగనుంది.
ప్రియా సేథ్ ఒక కిరాతక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోంది. 2018లో డేటింగ్ యాప్ (Tinder) ద్వారా పరిచయమైన దుష్యంత్ శర్మ అనే యువకుడిని ఆమె కిడ్నాప్ చేసింది. తన ప్రియుడు దీక్షాంత్ కమ్రా అప్పులు తీర్చడం కోసం రూ. 10 లక్షల తరాణాన్ని డిమాండ్ చేసింది. బాధితుడి తండ్రి రూ. 3 లక్షలు చెల్లించినప్పటికీ, బయటకు వెళ్తే తమ గుట్టు రట్టవుతుందనే భయంతో దుష్యంత్ను కత్తితో పొడిచి చంపేసింది. ఆపై శవాన్ని ముక్కలు చేసి సూట్కేసులో పడేసి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడింది.
పెళ్ళికొడుకు హనుమాన్ ప్రసాద్ కూడా తక్కువ వాడేమీ కాదు. 2017లో అల్వార్లో జరిగిన ఒక అత్యంత భయంకరమైన సామూహిక హత్య కేసులో ఇతను నిందితుడు. తన ప్రియురాలు సంతోష్ కోసం ఆమె భర్త బన్వారీ లాల్ను దారుణంగా హత్య చేశాడు. అయితే ఆ హత్యను చూసిన ప్రియురాలి ముగ్గురు పిల్లలను, ఒక మేనల్లుడిని కూడా ఆమె కోరిక మేరకే అతి కిరాతకంగా చంపేశాడు.
ఒకరు డేటింగ్ యాప్ హంతకురాలు, మరొకరు చిన్నపిల్లలని కూడా చూడకుండా ఐదుగురిని పొట్టనబెట్టుకున్న హంతకుడు. జైలు నిబంధనల ప్రకారం పెరోల్ సంపాదించి పెళ్లి పీటలు ఎక్కుతుండటం స్థానికంగా సంచలనం రేపుతోంది.
Read Also: దారుణం.. తల్లిదండ్రులే ఆ పిల్లలకు శాపం..