Software Employee Dairy Business | ఆవులతో పాల వ్యాపారం చేసి నష్టపోతున్న పాడిరైతుల బాధ చూడలేక తాను రంగంలోకి దిగాడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లక్షల ఆదాయనిచ్చే ఉద్యోగాన్ని వదిలి డైరీ వ్యాపారం చేశాడు. అతడిని అందరూ ముందు హేళన చేశారు. నీ తరం కాదన్నారు. అయినా పట్టుదలతో కష్టాలను ఎదుర్కొన్నాడు. క్రమంగా నష్టాలను దాటి లాభాల బాట పట్టాడు. ఈ రోజు వేయికిపైగా ఆవులతో డైరీ ఫామ్ నడుపుతూ, సేంద్రీయ ఉత్పత్తులతో వ్యవసాయం చేస్తూ ప్రతి సంవత్సరం కోట్ల ఆదాయం సంపాదించడమే కాకుండా వందకు పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు. ఇది సినిమా స్టోరీ కాదు.. నిజజీవితంలో జరిగిన సక్సెస్ స్టోరీ.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్ జిల్లా సికందర్పూర్కు చెందిన అసీమ్ రావత్.. కొన్ని సంవత్సరాలు యూరప్, అమెరికా దేశాలలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. తర్వాత ఉద్యోగాన్ని వదిలి, ‘హేతా’ అనే పేరుతో దేశీయ ఆవుల పెంపకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యాపారం సంవత్సరానికి 6 నుండి 8 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధిస్తోంది. అసీమ్ రావత్ కేవలం పాడి పరిశ్రమకే పరిమితం కాకుండా, సేంద్రియ వ్యవసాయం, 131 రకాల సహజ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు.
నిరుద్యోగులకు ఉపాధి
అసీమ్ రావత్ తన ఫామ్లో 110 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. పాడి పరిశ్రమలో చేసిన కృషికి గుర్తింపుగా, కేంద్ర ప్రభుత్వం 2018లో ‘గోపాల్ రత్న అవార్డు’తో సత్కరించింది. అలాగే ‘స్టార్టప్ ఆఫ్ ది ఇయర్’ సహా అనేక అవార్డులను అసీమ్ సాధించారు.
ప్రారంభంలో ఇబ్బందులు
డైరీ బిజెనెస్ గురించి అసీమ్ రావత్ మాట్లాడుతూ.. “మాది మధ్యతరగతి కుటుంబం. అయినప్పటికీ ఇంజినీరింగ్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విదేశాల్లో 14 సంవత్సరాలు పనిచేశాను. కానీ, నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. ఒక రోజు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో దేశీయ ఆవులతో పాల వ్యాపారం సాధ్యం కాదని.. రైతులు నష్టపోతున్నారని విని.. నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవు అంటే లక్ష్మీదేవి అని, సంపదకు మూలం అని వింటూనే ఉన్నాం. అప్పుడే దేశీయ ఆవులతో పాల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాను. అలా ఈ వ్యాపారం ప్రారంభమైంది.” అని ఆయన తెలిపారు.
గ్రామస్తుల విమర్శలు.. అపహాస్యం
దేశీయ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పినప్పుడు, తన కుటుంబం ఆందోళన చెందిందని అసీమ్ రావత్ చెప్పారు. తర్వాత కుటుంబం అంగీకరించిందని అన్నారు. తొలుత డెయిరీని కేవలం రెండు ఆవులతో ప్రారంభించానని చెప్పారు. ప్రారంభంలో గ్రామస్తులు అపహాస్యం చేశారని.. సమాజం నుంచి విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు, గోశాల నిర్వహణలో సమస్యలు వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపారు. తర్వాత వ్యాపారంలో లాభాల బాట పట్టానని పేర్కొన్నారు.
లీటర్ పాల ధర రూ.180.. దేశీ ఆవులు మరి
అసీమ్ రావత్ ఫామ్లో పాలు ధర కాస్త ఎక్కువే! అతని డెయిరీలో లీటరు పాలు రూ.180. అలాగే నెయ్యి ధర కిలో రూ.4000. ఫామ్లోని ఆవులకు క్యారెట్లు, జొన్నలు, బీట్ రూట్, మిల్లెట్స్ వంటి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. హైడ్రోపోనిక్ టెక్నాలజీని ఉపయోగించి మొలకెత్తిన మేతను కూడా ఆవులకు ఇస్తారు. ఆవులకు రసాయనాలు ఉపయోగించి తయారుచేసే ఏ దాణానూ అందించనని అసీమ్ రావత్ తెలిపారు. దీని కారణంగా వారి డెయిరీలోని పాలు అధిక నాణ్యతతో ఉంటాయని, అందుకే లీటరు పాలు రూ.180కి అమ్మినా వినియోగదారులు కొంటున్నారన్నారు.
దేశీయ జాతి ఆవు పాలు చాలా ఆరోగ్యకరం
అసీమ్ రావత్ ఫామ్లో కేవలం గిర్, సాహివాల్, థార్పార్కర్, హిమాలయన్ బద్రి వంటి దేశీయ జాతి ఆవులే ఉంటాయి. జెర్సీ, బ్రౌన్ స్విస్ వంటి విదేశీ జాతి ఆవులు భారతదేశ వాతావరణానికి తగినవి కావని అసీమ్ అభిప్రాయం. “విదేశీ జాతి ఆవు పాలలో ఏ1 ప్రోటీన్ ఉంటుంది. కొద్దిగా ఏ2 రకం ప్రోటీన్ కూడా ఉంటుంది. ఏ1 ప్రోటీన్ అనేక వ్యాధులకు కారణమవుతుంది. దేశీయ జాతి ఆవుల పాలలో ఏ2 రకం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది,” అని అసీమ్ రావత్ చెప్పారు.
దూడలు తాగడానికే సగం పాలు
అసీమ్ రావత్ తన గోశాలలోని దూడలను బాగా చూసుకుంటానని తెలిపారు. “తల్లి పాలలో సగం దూడకు వదిలేస్తాను. మిగతా సగం పాలను తీస్తాను. దీంతో దూడలు ఎక్కువగా పాలు తాగి ఆరోగ్యంగా ఉంటాయి. రావత్ తన ఫామ్లోని ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ ఎరువులు మరియు ఔషధాలను తయారు చేస్తున్నారు. దీన్ని రైతులకు విక్రయిస్తున్నారు,” అని చెప్పారు.
ప్రధాన మంత్రి మోదీతో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించడం తనకు అత్యంత గర్వకారణమైన క్షణమని అసీమ్ రావత్ తెలిపారు. మోదీని మథురలో జరిగిన ఒక కార్యక్రమంలో కలిశానని చెప్పారు. “మథుర సాహివాల్ జాతి ఆవును కూడా తీసుకెళ్లాను. అక్కడ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నా ఆవుతో ఫోటోలు తీసుకున్నారు. నేటికీ వెటర్నరీ మొబైల్ వ్యాన్పై నా ఆవుతో కలిసి మోదీ దిగిన ఫోటో ఉంది. ఈ రంగంలోకి రాణించాలంటే పాడి పరిశ్రమపై పూర్తిగా ఆసక్తి ఉండాలి,” అని అసీమ్ రావత్ తెలిపారు.