అనుకోని సంఘటనతో దాదాపు మరణాన్ని చూసి బయటికి వచ్చిన వ్యక్తి… తన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు. జీవితంలో ఇక చూడాల్సినది ఏదీ లేదని అంటున్నాడాయన. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? ఆఫ్రికాలో జరిగిన ఒక భయంకర ఘటనలో గైడ్గా పనిచేసిన వ్యక్తి హిప్పో నోట్లోంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కొన్ని క్షణాల పాటు అతడు హిప్పో నోటిలోనే ఉండిపోయాడు. ఈ సంఘటనలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు విన్నవారిని షాక్ కు గురిచేస్తున్నాయి. బయటకు ప్రశాంతంగా కనిపించే హిప్పోలు నిజానికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జంతువులలో ఒకటిగా చెప్పుకోవాలి.
సగం మనిషి హిప్పోనోటిలోనే
పాల్ టెంప్లర్ జింబాబ్వేలో నది టూర్ గైడ్గా పనిచేస్తూ పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం కల్పించేవారు. 1996 మార్చి 9న ఆయన సహచర గైడ్లు, పర్యాటకులతో కలిసి జంబేజి నది వద్ద టూర్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఒక భారీ మగ హిప్పో పడవల వైపు దూసుకొచ్చింది. ముందుగా మరో గైడ్ పడవను ఢీకొట్టి తలకిందులు చేసింది. నీటిలో పడిపోయిన సహచరుడిని కాపాడేందుకు పాల్ టెంప్లర్ వెంటనే నదిలో పడిపోయారు. సహచరుడిని చేరుకునేలోపే హిప్పో నేరుగా టెంప్లర్పై దాడి చేసింది. ఒక్కసారిగా చీకటి కమ్ముకున్నట్లు అనిపించిందని ఆయన వివరించారు. తన శరీరం నడుము వరకు హిప్పో గొంతులోకి వెళ్లిపోయిందని చెప్పారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయిందని గుర్తుచేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత హిప్పో అతడిని బయటకు వదిలింది. కానీ అక్కడితో ప్రమాదం ముగియలేదు. మళ్లీ అదే హిప్పో తిరిగి దాడి చేసి మరోసారి తన నోటిలోకి లాగిందని టెంప్లర్ తెలిపారు. ఇలా పలు సార్లు దాడి జరగడంతో ఆయన తీవ్ర గాయాలకు గురయ్యారు.
Also read: Old Toothbrush: పాత టూత్ బ్రష్ పడేసే కన్నా ఎన్ని రకాలుగా వాడవచ్చో తెలుసా?
తీవ్రంగా దెబ్బలు అమినా కూడా…
దాడి అనంతరం టెంప్లర్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. శరీరంపై అనేక గాయాలు, ఊపిరితిత్తుల సమస్యలు, కండరాల చీలికలు వంటి గాయాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు చివరకు దాన్ని తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ సహచర గైడ్లు, స్థానికులు వెంటనే సహాయం చేయడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. గాయాలతోనే దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనలో టెంప్లర్ సహచరుడైన మరో గైడ్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. పడవ తలకిందులైన సమయంలో నీటిలో పడిపోయి కనిపించకుండా పోయిన అతడి మృతదేహం రెండు రోజుల తర్వాత గుర్తించారు. పర్యాటకులు మాత్రం అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన నది టూర్లలో ఉన్న ప్రమాదాలను ప్రపంచానికి తెలియజేసింది.
హిప్పోలు సాధారణంగా శాకాహార జంతువులు. అయినప్పటికీ తమ ప్రాంతాన్ని రక్షించేందుకు అవసరమైతే దాడి చేసేందుకు వెనుకాడవు. నీటిలో వేగంగా కదలగల సామర్థ్యం ఉండటం వల్ల అవి నీటితో మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం అనేక మంది హిప్పో దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని అంచనాలు సూచిస్తున్నాయి. అందుకే నది ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో హిప్పోలను చూసినా దగ్గరకు వెళ్లకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్ర గాయాల తర్వాత కూడా పాల్ టెంప్లర్ జీవితం ఆగలేదు. కోలుకున్న అనంతరం ఆయన మోటివేషనల్ స్పీకర్ గా మారి తన అనుభవాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యం కోల్పోవద్దని, ప్రతి రోజు ఒక కొత్త అవకాశం అని ఆయన సందేశం ఇస్తున్నారు. తన అనుభవాల ఆధారంగా పుస్తకం కూడా రచించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.