Viral Video: ముంబైలో కాళిమాత ఆలయంలో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెంబూర్ ప్రాంతంలోని ఆలయానికి ఆదివారం వచ్చిన భక్తులు, కాళిమాత విగ్రహం మదర్ మేరీ వేషధారణలో ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా శక్తి స్వరూపిణి కాళిమాతకు చేసే అలంకరణకు పూర్తిగా విరుద్ధంగా, క్రైస్తవ సంప్రదాయంలో చూపే మదర్ మేరీ వస్త్రధారణలో విగ్రహం కనిపించడంతో భక్తులు ఆగ్రహంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు విచారణలో సంచన విషయాలు
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో ఆలయ పూజారి రమేష్, రాత్రి కలలో దేవి ప్రత్యక్షమవుతూ “మదర్ మేరీ రూపంలో నన్ను అలంకరించు” అని చెప్పిందని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వివరణతో భక్తుల ఆందోళన మరింత పెరిగింది. సమాజంలో విభేదాలు రేకెత్తించే అవకాశం ఉన్న చర్యగా భావించిన పోలీసులు, మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో వ్యవహరించారనే ఆరోపణలపై, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూజారిని అరెస్టు చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరు పరచగా, రెండు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ మంజూరైంది.
వీడియో వైరల్
ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశంలో మత వివాదాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇది నిజంగా భక్తి నేపథ్యంతో చేసిన చర్యా? లేక దీని వెనుక మరే ఉద్దేశ్యం ఉందా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనే..
గతంలో జార్ఖండ్లోని రాంచీలో దుర్గా పూజ పండల్ ‘వాటికన్ సిటీ’ రూపంలో ఏర్పాటు చేయడంతో కూడా పెద్ద చర్చ ఏర్పడింది. ఆ వేళ విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ సంప్రదాయాలను అవమానించే విధంగా ఆ థీమ్ రూపొందించారని వ్యాఖ్యానించారు. అయితే, పండల్ నిర్వాహకులు మాత్రం తమ లక్ష్యం మత ఐక్యతను చూపడం మాత్రమేనని చెప్పినా, పరిస్థితి శాంతించలేదు. అప్పట్లో పెద్ద వివాదానికే దారితీశాయి.