Pulivendula: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? సొంత ఇల్లు చక్కబెట్టుకునే పడ్డారా? ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల రావచ్చన్న సంకేతాలతో అలర్ట్ అయ్యారా? ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారా? ఇంతకీ జగన్ పర్యటనపై పులివెందుల ప్రజలు ఏమనుంటున్నారు? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే..
రూటు మార్చిన మాజీ సీఎం జగన్
వైసీపీ అధినేత జగన్ మనసు మార్చుకున్నారు. అధికారం పోయి దాదాపు 18 నెలల తర్వాత సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం బ్రాహ్మణపల్లెలో అరటి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డ్యామేజ్ అయిన అరటి తోటలను పరిశీలించారు. దిగుబడి ఎంత వచ్చింది? మార్కెటకు ఎంత సరుకు వెళ్తుందని అనేదానిపై వివరాలు తెలుసుకున్నారు.
నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియతో మాట్లాడారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు సర్కార్ రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. మా ప్రభుత్వంలో రైతులకు అంతా మంచి జరిగిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.
రెండురోజులు పులివెందుల నియోజకవర్గంలో పర్యటన
హార్టికల్చర్ పంటల విషయంలో అనంతపురం నుంచి ఢిల్లీకి పండిన పంటలను ఎగుమతి చేశామన్నారు. ఈ విషయంలో ఏకంగా కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. కేవలం అరటి కాదు వరి, చీని, టమాటా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు.
వైసీపీ హయాంలో సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లమని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. ఎరువులు సైతం బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ దాదాపు రూ. 1100 కోట్లు బకాయిలు పెట్టారన్నారు.
ALSO READ: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. కొబ్బరి రైతులతో పవన్ కల్యాణ్
శనక్కాయలు- బెల్లానికి మెడికల్ కాలేజీలను అమ్మడానికి చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఆదాయం ప్రభుత్వానికి రాకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. మద్యం, ఇసుక, మట్టి మొదలు రాజధాని భూముల వరకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఆపై స్కాములు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అన్ని విధాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన గ్యాంగ్ సభ్యులు దోచుకుని, పంచుకుంటున్నారని అన్నారు. వారికి సమయం చాల్లేదని, ఇక రైతుల గురించి ఏం పట్టించుకుంటారని విమర్శించారు. 18 నెలల కాలంలో దాదాపుగా 16 సార్లు కరువు లేదా వరదల వల్ల రైతులు నష్టపోయారని అన్నారు.
84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు ఇన్యూరెన్స్ పరిధిలో వచ్చారన్నారు. మరి మిగతా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మాజీ సీఎం. ఈ ప్రభుత్వంలో రైతుల ఖర్చులు తారాస్థాయికి పెరిగాయని, ఆదాయం ఏ మాత్రం లేదన్నారు. ఒకప్పుడు నెంబర్ వన్లో ఉన్న రాష్ట్రానికి ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందన్నారు. జగన్ మాటలు చూసి అధికార పార్టీ నేతలు నవ్వుకుంటున్నారు. ఎప్పటిమాదిరిగానే అవే అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు.