రైల్వే స్టేషన్లు, రైల్వే పరసరాలు, రైల్వే ట్రాక్స్ మీద ఫోటోలు, వీడియోలు తీయకూడదని రైల్వే అధికారులు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తరచుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం చేసే డేంజర్ స్టంట్స్ చేయకూడదని, ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా, కొంత మంది తమ పద్దతి మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, తమ లోకం తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రాణాలను రిస్క్ లో పెట్టి స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఈ వైరల్ వీడియో ఓ యువకుడు రైల్వే ట్రాక్ మధ్యలో పడుకుని ఉండగా, వేగంగా వస్తున్న రైలు అతడి మీది నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. రైలు వెళ్లిపోయిన తర్వాత, ఆ యువకుడు లేచి నిలబడి, ఏమీ కాలేదన్నట్టు నడిచిపోతాడు. ఈ స్టంట్ను రికార్డ్ చేసేందుకు మరొక వ్యక్తి వీడియో తీసినట్లు తెలుస్తోంది. ట్రాక్ మీద పడుకున్న యువకుడు స్వయంగా మొబైల్ ఫోన్ పట్టుకుని రైలు వస్తున్న దృశ్యాన్ని రికార్డ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను దినేష్ కుమార్ అనే యూజర్ ఎక్స్ లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
रेलवे ऐसे गधों को क्या सजा दे सकती है..?
कंमेंट करके बताएं! pic.twitter.com/BR0geqs7r3
— Dinesh Kumar (@DineshRedBull) December 16, 2025
ఈ వీడియోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. “అత్యంత ప్రమాదకరం, బాధ్యతా రాహిత్యం” అంటూ మండిపడుతున్నారు. “రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం మానుకోవాలని సూచిస్తున్నారు. “ఇలాంటి స్టంట్స్ సదరు యువకుడి ప్రాణాలతో పాటు రైలు నడిపే వ్యక్తి, రైలే సిబ్బంది, ప్రయాణీకుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తుంది” అని మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. “రైల్వే ట్రాక్స్ మీద ఇలాంటి పిచ్చి వేషాలు వేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి” అని కోరుతున్నారు. మరికొంత మంది ఈ వీడియోను రైల్వేమంత్రికి ట్యాగ్ చేసి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు.
ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియదు. కానీ, గత రెండు రోజులుగా ఈ వీడియో వైరల్ అవుతోంది. అదే సమయంలో చాలా మంది నెటిజన్లు ఈ వీడియోలో చూపించినట్లు నిజంగా తను రైలు కిందపడుకోలేదని, కేవలం తన మొబైల్ ను మాత్రమే పెట్టి ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా జస్ట్ నెటిజన్లను మాయ చేసే జిమ్మిక్కు అంటున్నారు. స్టంట్ టైమ్ లో ఫోన్ ట్రాక్పై ఉండవచ్చని మరికొంత మంది అంటున్నారు. నిజానికి ఇలాంటి స్టంట్స్ గతంలో కూడా జరిగాయి. ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి చోట్ల ఇలాంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి రైల్వే పోలీసులు కొంత మందిపై చర్యలు కూడా తీసుకున్నారు.