వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం ఆ పార్టీ నేతలను షాక్కు గురి చేసింది. పాత మీడియా ప్యానెలిస్టుల స్థానంలో ఆయన కొత్త వారికి చోటు కల్పించారు. ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్లు చేసే పనులు అటు పార్టీకి ఇటు జగన్కు చెడ్డపేరును తీసుకువచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారంతా జగన్ను మరల ప్రసన్నం చేసుకునేందుకు మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది వాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదు.వైసీపీ నేతల లూస్ టాక్ కూటమి ప్రభుత్వానికి ఏమో గానీ సొంత పార్టీకే చెడ్డ పేరును తీసుకువస్తున్నట్లు గుర్తించిన అధినేత గతంలో ఉన్నటువంటి మీడియా ప్యానెలిస్టులను పక్కన బెట్టినట్టు తెలుస్తున్నది.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీలకు అయిన మీడియా ప్యానెలిస్టులు ఉంటారు. వారంతా పార్టీ లైన్కు కట్టుబడి ఉండాలి. పార్టీ లీడర్ ఏది చెబితే దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. బయట డిబేట్స్, ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు నోరు అదుపులో పెట్టుకుని కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడాలి. అప్పుడు అది పార్టీకి ఎటువంటి రీమార్క్ అనేది తీసుకుని రాదు.గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు మాట్లాడే ప్రతి మాటలను జనాలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రజలకు మంచి చేయాలనే తపన, ప్రభుత్వం చేసే తప్పులపై గట్టిగా ప్రశ్నిస్తేనే ప్రజల్లో వారికి మనుగడ ఉంటుంది.
టీవీ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్, బయట ప్రెస్మీట్లో మాట్లాడేటప్పుడు పార్టీని బలంగా డిఫెండ్ చేయగల సత్తా ఉన్నవారికే పార్టీ అధినేత మీడియా ప్యానెలిస్టులుగా అవకాశమిస్తారు.మొన్నటి వరకు కొనసాగిన వారంతా న్యూస్ యాంకర్లు అడిగే ప్రశ్నలకు, ప్రత్యర్థులు అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణిని ప్రదర్శించడంతో పాటు సొంత పార్టీనే ఇరకాటంలో పడేసినట్లు చర్చ జరుగుతున్నది. వీటిన్నింటిని గమనించిన పార్టీ అధినేత జగన్.. వీరితో మొదటికే మోసం వస్తుందని గమనించి శుక్రవారం తాడేపల్లి గూడెంలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్ వేదికగా కొత్తగా 12 మంది ప్యానెలిస్టుల జాబితాను ప్రకటించారు.
ఈ మేరకు వైసీపీ పార్టీ కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. పసుపులేటి సురేశ్ (తిరుపతి), రేగిడి లక్ష్మణరావు (విజయనగరం), డాక్టర్ మంచ నాలమల్లేశ్వరి (విశాఖపట్నం), శేఖర్ రెడ్డి (ఎస్పీఎస్ నెల్లూరు) అవుతు శ్రీధర్ (గుంటూరు), ఎల్ ఎమ్ మోహన్ రెడ్డి (అనంతరపురం), కాకుమాను రాజశేఖర్ (ప్రకాశం), బొట్ల రామారావు (ప్రకాశం), జ్వలాపురం శ్రీకాంత్ (అనంతపురం), బండి పుణ్యశీల (ఎన్టీఆర్ జిల్లా), చిట్ట విజయ భాస్కర్ రెడ్డి (పల్నాడు).. షేక్ మహబూబ్ షరీఫ్ (గుంటూరు) హిందీ చానెల్..వీరంతా ఇకపై వైసీపీ మీడియా ప్యానెలిస్టులగా కొనసాగనున్నారు.దిద్దుబాటు చర్యల్లో భాగంగా మాజీ సీఎం జగన్ పార్టీ మీడియా ప్యానెలిస్టులను మార్చినట్టు తెలుస్తుండగా..వచ్చే టర్మ్లో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తొలి అడుగు వేసిందని.. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని వైఎస్సార్ శ్రేణులు చెబుతున్నారు.