50 Maoists Arrested: ఆపరేషన్ కగార్తో కకావికలమయ్యారు మావోయిస్టులు. తలదాచుకోవడానికి అడవుల నుంచి పట్టణాల బాట పట్టారు. ఏపీని కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ మధ్యకాలంలో ఏపీకి ఒడిషా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కూలి పనుల కోసం రావడంతో ఆ ప్రాంతం సేఫ్గా ఉంటుందని భావించారు. మూడువారాల కిందట విజయవాడకు వచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకున్నారు.
ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులు అరెస్ట్
దండకారణ్యంలో బలగాల కూంబింగ్తో బెంబేలెత్తిపోయారు మావోయిస్టులు. ఓ వైపు బలగాలు.. ఇంకోవైపు డ్రోన్లతో గాలింపు నేపథ్యంలో మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. చివరకు అడవులను వదిలి పట్టణాలను చేసుకున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, రామవరప్పాడు, సఖినేటిపల్లి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. అక్కడ నుంచి వారి యాక్టివిటీస్ మొదలుపెట్టారు. వీరికి స్థానికంగా కొందరు మావోయిస్టు సానుభూతిపరులు సహాయం చేసినట్టు తెలుస్తోంది. వారిని కూడా బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.
మంగళవారం ఏపీలోని కీలకమైన ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి బలగాలు. 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ న్యూ ఆటోనగర్లో 27 మంది, గన్నవరం-1, రామవరప్పాడు-4, ఏలూరు- 15 మంది, కాకినాడ-2 , సఖినేటిపల్లి- ఒకరు చొప్పున పోలీసులకు చిక్కారు. మొత్తం 50 మందిలో ఒకరు లేదా ఇద్దరు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు నోరు మెదపడం లేదు. విజయవాడలో పట్టుబడిన వారి నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలు, బుల్లెట్లు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడినవారిలో ఇద్దరు అగ్రనేతలు?
ఏలూరులో మావోయిస్టులు ఉన్నట్లు రెండువారాల కిందట పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా పెట్టి గుర్తించారు. మొదట నలుగుర్నిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ద్వారా మిగిలినవారిని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కినవారిలో నలుగురు మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. కేవలం 45 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేశారు పోలీసులు. పట్టుబడిన వారిలో లచ్చు, లక్మాలు కీలక నేతలుగా భావిస్తున్నారు పోలీసులు.
ALSO READ: ఏపీ- తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సరిహద్దు అటవీ ప్రాంతాల రాకపోకలపై పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఒడిశా, ఛత్తీస్గఢ్ ట్రైబల్ ప్రాంతానికి చెందినవారు. వారిని గోండు తెగకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. ఆ భాష తెలిసిన వారిని పిలిపి విచారణ చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ద్వారా వీరంతా ఏలూరుకు చేరినట్లు భావిస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒడిషా, ఛత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లా, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాలపై గాలింపు, ఆపై నిఘా కఠినతరం చేశారు.