PM Modi: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీ తన పర్యటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యసాయి బాబా సమాజ సేవను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు.
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో.. పాల్గొననున్న మోడీ..
ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకుంటారు ప్రధాని. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో.. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదల..
ప్రధాని ఏపీ నుంచి తమిళనాడుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కోయంబత్తూరులో దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు 2025ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేస్తారు. 21వ విడత కింద 18,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ సదస్సులో ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మంది రైతులు, నిపుణులు పాల్గొననున్నారు.
Also Read: కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి..