తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న హీరో సుమన్ తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై స్పందిస్తూ.. తాను ఒక సెక్యులర్ వాదినని.. భారతదేశం అనేక కులాలు, మతాలకు నిలయమని పేర్కొన్నారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రమని అన్నారు. అలాంటి చోట లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేది వాస్తవం అయితే, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలని సుమన్ కోరారు. ‘కేవలం సస్పెన్షన్లతో సరిపెడితే సరిపోదు. నాకు సంబంధం లేదంటే అసలు కుదరదు. ఆ సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలి. ఇందులో ఏ కులం, ఏ మతం వారైనా సరే.. తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై పారదర్శకమైన విచారణ జరగాలని సుమన్ సూచించారు. ఇందుకోసం ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. కల్తీకి కారణమైన వారిని గుర్తించి.. వారికి కఠిన శిక్ష పడేలా చూడటం ద్వారానే భక్తులకు నమ్మకం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయం ఏదైనా కావచ్చు, కానీ భక్తుల నమ్మకం దగ్గర రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: Pawan – Lokesh: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. పవన్ కళ్యాణ్తో లోకేశ్ భేటి.. కీలక అంశాలపై చర్చ!