Delhi Peeragarhi Deaths: దేశ రాజధాని ఢిల్లీ ఔటర్ ప్రాంతంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమైన ఘటనకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ హత్యలకు సంబంధించి కమ్రుద్దీన్ అనే ‘బాబా’ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. క్షుద్రపూజల ద్వారా ‘ధనవర్షం’ కురిపిస్తానని నమ్మించి, అమాయకులను మోసం చేసి ప్రాణాలు తీయడం ఇతని వృత్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు బాధితుల నమ్మకాన్ని గెలుచుకుని, వారిని మానసికంగా ప్రభావితం చేసి, చివరకు విషం కలిపిన లడ్డూలు ఇచ్చి హతమారుస్తాడని దర్యాప్తులో తేలింది.
గత ఆదివారం సాయంత్రం ఒక తెల్లటి టైగర్ కారులో 76 ఏళ్ల వృద్ధుడు, 47 ఏళ్ల ప్రాపర్టీ డీలర్, 40 ఏళ్ల మహిళ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేయగా మద్యం సీసాలు, శీతల పానీయాలు, బాధితుల వ్యక్తిగత వస్తువులు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. బాధితులతో కలిసి కారులో ప్రయాణించిన తాను, వారికి మద్యం, శీతల పానీయాలతో పాటు విషం కలిపిన లడ్డూలను తినిపించినట్లు ఒప్పుకున్నాడు.
బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత, వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులను తీసుకుని నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. కేవలం ధనం కోసమే ఈ క్రూరమైన హత్యలకు పాల్పడినట్లు పోలీసుల ప్రకటన ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇలాంటి మోసాలకు సంబంధించి గతంలో ఇంకెవరైనా బలయ్యారా అనే కోణంలో విచారణను వేగవంతం చేశారు.
Read Also: Viral Video: ప్రమాదం కాదు.. పేరెంట్స్కి హెచ్చరిక, వీడియో వైరల్