Adimulapu Suresh | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కామెడీ యాక్టర్.. ప్రజలు ఆయనను నమ్మడం లేదని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రాప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నా ప్రజలకు వారిపై నమ్మకం లేదని చెప్పారు.
ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన సాగిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గ్యారెంటీ అంట.. పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అట అని ఆయన టిడిపి, జనసేన మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏదో సాధిస్తుందని బిజేపీ 8 సీట్లు కేటాయిస్తే.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజేపీ, జనసేన కోసం ఎన్నికల ప్రచారం చేశారు.. కానీ జనసేన అభ్యర్థులకు ఆయన ఇమేజ్ ఓటమి నుంచి ఏమాత్రం కాపాడలేకపోయింది. వారందరికీ డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ అంశాన్ని వైసీపీ నాయకులు ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారు.