Amaravati: ఏపీ రాజధాని అమరావతి రైతులు.. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కూటమి సర్కారు వచ్చినా తమ సమస్యలు పరిష్కరం అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలపై వినతులు ఇవ్వడానికి వస్తే అవమానకరంగా సీఆర్డీఏ అధికారులు మాట్లాడుతున్నారని.. సీఎం చంద్రబాబు తమను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. రాజధాని రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ పోరాటం చేస్తామని అల్టిమేటం జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమావేశమయ్యారు. భూములు ఇచ్చిన తాము అవమానాలు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలు ఏవి పరిష్కారం కావడం లేదని చెప్పారు. ఏమైనా సమస్యలు చెప్పుకుంటే సిఅర్డీ అధికారులు అత్యంత చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఉన్న ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాట ఎవరు వినడం లేదన్నారు. సీఎం చంద్రబాబు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
భూములు ఇచ్చి వారితో మాటలు అనిపించుకోవాల్సి వస్తుందంటున్నారు. తమపై పెట్టిన కేసులు ఇప్పటికీ తొలగించలేదంటున్నారు రైతులు. ఈ ఏడాది ఆగస్టు 5న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కమిషనర్కు 14 సమస్యలను తెలియజేశామని, అయినా ఇప్పటివరకు స్పందన లేదని వాపోయారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో రైతులంతా మరోసారి సమావేశం అవుతామని, ఆ సమావేశంలో పోరాట కార్యాచరణ ఖరారు చేస్తామని నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు రైతులు. అమరావతి అని పార్లమెంటులో చట్టం చేయడం, సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న మూడు రాజధానుల కేసును, ఆర్-5 జోన్ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను తక్షణం పరిష్కరించడం, వార్షిక కౌలు బకాయిల చెల్లింపు, హద్దురాళ్లు పోయిన రిటర్నబుల్ ప్లాట్లలో పెగ్ మార్కింగ్ వేసి రాళ్లు వేయించాలన్నారు. అలాగే ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడడం, రాజధాని గ్రామాల్లో పదేళ్లుగా ఎన్నికలు జరగక 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయిన కారణంగా, ఆ నిధులు కేటాయించి 29 గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
Also Read: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!
ఇప్పటికీ భూములివ్వని చోట సమీకరణ, లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడం, గ్రామకంఠ సమస్యల పరిష్కారించాలన్నారు. పెండింగులో ఉన్న జరీబు, మెట్ట సమస్యలు, పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి మొత్తం 14 రకాల అంశాలపై రైతులు ప్రభుత్వం, సీఆర్డీఏకు విన్నవించారు. ఈ సమస్యల విషయంలో తగిన స్పందన లేకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.