Ambati Rambabu Bail: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో ఊరట లభించినా, జైలు కష్టాలు మాత్రం తొలగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా, పోలీసుల కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, ఒక కేసులో బెయిల్ వచ్చినా ఆయన విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది నవంబర్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’ ర్యాలీపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన మరో కేసులో కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీనివల్ల ఈ రెండో కేసులో కూడా బెయిల్ లభిస్తేనే అంబటి జైలు నుంచి బయటకు వచ్చే వీలుంటుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంబటి రాంబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన ఎనిమిది రోజుల్లోనే ఆయనపై ఏకంగా 36 కొత్త కేసులు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆయనపై మొత్తం 44 కేసులు నమోదైనట్లు సమాచారం. ఒక కేసులో విముక్తి లభించే లోపే మరొక కేసులో రిమాండ్ విధిస్తుండటంతో, అంబటి రాంబాబు చుట్టూ కేసుల చక్రబంధం బిగుస్తోంది