Collector BM Santhosh: అలంపూర్ ఆలయాల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు ఈనెల 14 నుంచి 18 వరకు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు తాగునీటి కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాతో పాటు, లైటింగ్ ఏర్పాట్లు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. తుంగభద్ర నది తీరాన గజ ఈతగాళ్లను నియమించి, అనుకోని పరిస్థితుల్లో భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు.
Also Read: Punjab Crime News: పంజాబ్లో దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్న యువకుడు!
ఆర్టీసీ తరపున అదనపు బస్సులు నడిపేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రథోత్సవం నిర్వహించే ప్రాంతంలో రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని, అగ్నిమాపక శాఖ వాహనాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు వాలంటీర్లు, ఇతర సేవా సంస్థల సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. వీఐపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దర్శనార్థం వచ్చే అవకాశం ఉన్నందున ప్రోటోకాల్ ప్రకారం వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ ఆలయాల పరిసరాల్లో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖ తరపున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును నియమిస్తున్నట్లు చెప్పారు. మహిళా భక్తుల సౌకర్యార్థం అదనంగా మహిళా కానిస్టేబుల్స్ ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు తమ పోలీస్ సిబ్బంది ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పని చేస్తారని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, అలంపూర్ ఆలయాల కార్య నిర్వహణాధికారి దీప్తి, తహసిల్దార్ మంజుల, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: HYDRAA: రూ.60 కోట్ల విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా కాపాడారంటే..?