Amaravati: మెగా డీఎస్సీ వ్యవహారంలో వైసీపీకి హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై సీబీఐ విచారణకు నిరాకరించింది. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం అనుమతిస్తే, దాని ఉద్దేశం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది న్యాయస్థానం.
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025పై సీబీఐ విచారణకు నిరాకరించింది హైకోర్టు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మంగళవారం న్యాయస్థానం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.
నియామక ప్రక్రియపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టుకు వివరించారు. నియామక ప్రక్రియలో అవకతవకలు, నిష్పక్షపాతాన్ని, సమగ్రతను ప్రభావితం చేసే విధంగా ఉందని వాదించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా న్యాయస్థానానికి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.
కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. మీ వాదనలతో ఏకీభవించలేమని స్పష్టం చేసింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్- నియామకాలను సవాల్ చేస్తూ 335 పిటిషన్లు దాఖలైనట్లు హైకోర్టు ప్రస్తావించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం చాలా విలువైనదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని తేల్చి చెప్పింది.
దీనిపై వాదనలు కొనసాగిస్తారా? లేదా ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ నుంచి సూచనలు తీసుకుని రావాలని చంద్రశేఖర్ రెడ్డి తరుఫు న్యాయవాదికి సూచించింది హైకోర్టు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ప్రధాన డిమాండ్. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేట్టింది. అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరిన విషయం తెల్సిందే.
ALSO READ: కోడిగుడ్డుపై ఈగలు పీకడం.. వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్