Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(నవంబర్ 19) రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. కడప జిల్లా కమలాపురంలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు. ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. మొదటి విడత కింద ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున జమ చేసింది. రేపు 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7000 చొప్పున రెండో విడత నిధులను జమ చేయనుంది.
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 19న అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు మంత్రి తెలిపారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19న కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ స్కీమ్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
ఎన్పీసీఏలో ఇన్ యాక్టివ్గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్నవారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 46,62,904 లక్షల మంది రైతులకు బుధవారం డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు మొత్తం రూ .7 వేలు అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద రూ.3077.77 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేయనున్నాయి.