CM Revanth Reddy: దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం కోరారు. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తేనే అన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందడానికి వీలవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఐటీసీ కోహినూర్లో మంగళవారం జరిగిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ ప్రాంతీయ సమావేశంలో కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్లాల్ దేశాయ్తో పాటు పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్ను కేవలం అభివృద్ధి చేయడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త నగరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ దిశగా.. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో ఒక సమగ్రమైన కొత్త ప్రణాళికను రూపొందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ రాష్ట్రం కూడా క్రియాశీలక భాగస్వామి అవుతుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తేనే దేశాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంలో తెలంగాణ రాష్ట్రం తరఫున కనీసం 10 శాతం వాటా ఇవ్వాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. దేశ జీడీపీలో కీలక పాత్ర పోషించే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ వంటి ఐదు మెట్రోపాలిటన్ నగరాలు దేశానికి ఎంతో ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఈ కీలక నగరాల అభివృద్ధికి కేంద్రం మద్దతు లేకపోతే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా.. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి, అలాగే మూసీ నది సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్ మోడల్ను ప్రస్తావించారు. ‘ప్రధాని మోదీ గుజరాత్ మోడల్ను రూపొందించుకున్నట్లే.. మేము కూడా తెలంగాణ మోడల్ను తీసుకువచ్చాం. ఆయన సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే.. మేము కూడా మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని మోదీ గతంలో ఏ విధమైన సహకారాన్ని అందించారో.. అదే తరహా సహకారాన్ని మేము ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కోరుతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు ఎన్నికల సమయం మాత్రమే కేటాయించాలని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.