Vaikunta dwara darshan Tirumala: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మొత్తం 182 గంటల పాటు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామన్నారు. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తితిదే పాలక మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాలలో మొదటి మూడు రోజులు(డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించినట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ డిప్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ టిక్కెట్లకు సంబంధించిన నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్ 2న లాటరీ విధానంలో ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో స్థానికుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామన్నారు. జనవరి 6, 7, 8వ తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్లు కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.