Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులతో ఆయన వరుసగా భేటీ అవుతూ ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యంగా రాష్ట్రంలో సేంద్రీయ సాగు (Natural Farming) విస్తరణపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు సుమారు 8 లక్షల హెక్టార్లలో సేంద్రీయ సాగుకు మొగ్గు చూపడం విశేషమని ఆయన కేంద్ర మంత్రికి తెలిపారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించినందుకు గాను PM-PRANAM పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.216 కోట్ల ప్రోత్సాహకాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2024-25 ఏడాదిలో సాగులో రసాయనాల వినియోగాన్ని రాష్ట్రం 2.28 శాతం మేర తగ్గించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన కొబ్బరి సాగు అభివృద్ధికి రూ.200 కోట్ల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. కర్ణాటక రాష్ట్రం తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు, కోకోనట్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల సుమారు 15 వేల మందికి ఉపాధి లభించడంతో పాటు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన వివరించారు. వీటితో పాటు ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.695 కోట్లు విడుదల చేయాలని కోరారు.
తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్లను విడుదల చేయాలని చంద్రబాబు విన్నవించారు. ధరలు పడిపోయిన సమయంలో రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటాతో కలిపి రూ.200 కోట్ల చెల్లింపులు జరిపిందని గుర్తుచేశారు. మరో కీలక అంశంగా, ఏపీలో ‘మఖానా డెవలప్మెంట్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో దాదాపు 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, దీనికి కేంద్రం ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
Read Also: Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నయా రికార్డు, హస్తినా వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన