AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢీల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులకు ఆమోదాలు సాధించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబుతో పాటు ఈ ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు పాల్గొననున్నారు.
చంద్రబాబు తన పర్యటనలో కీలక మంత్రులతో వరుస భేటీలకు సిద్ధమయ్యారు. ఉదయం 9.45 గంటలకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర నదీజల వివాదాలు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల పథకాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, నిధుల విడుదల అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది.
అనంతరం ఉదయం 10.45 నుంచి 11.30 గంటల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న విభజన హామీలు, ప్రత్యేక నిధుల అంశాలు కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
పార్లమెంట్లో ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీ ఆర్థికంగా రాష్ట్రానికి ఎంతో కీలకమని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు, పెండింగ్ బకాయిల విడుదల, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై సీఎం చంద్రబాబు స్పష్టంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిమితులు, కేంద్ర సహకారం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉండగా కేంద్ర షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనవాల్తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అంతర్గత జల రవాణా ప్రాజెక్టులు, లాజిస్టిక్స్ హబ్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.
అదే సమయంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖ కార్యక్రమమైన.. CREDAI నేషనల్ కాంక్లేవ్ – రియల్ ఎస్టేట్ ఎక్స్లెన్స్ 2025లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను దేశవ్యాప్తంగా ఉన్న డెవలపర్లకు వివరించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంధన మౌలిక సదుపాయాలు, గ్యాస్ పైప్లైన్లు, పెట్రోలియం ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, ఎక్స్ప్రెస్వేలు, పెండింగ్ రోడ్ ప్రాజెక్టులపై ఈ భేటీ కీలకంగా మారనుంది.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు అరెస్ట్..?
మొత్తంగా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో సాగుతున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. రాష్ట్రాభివృద్ధికి కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.