Pawan Kalyan for BJP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారా.. అక్కడి తెలుగు వారిని ఆకర్షించేందుకు బీజేపీ పక్కా ప్లాన్ లో పవన్ ను రంగంలోకి దింపిందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మహారాష్ట్రలో ఎన్నికల సంధర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి దింపింది. అది కూడా ఏపీ, తెలంగాణ ప్రజలు అధికంగా ఉండే నియోజకవర్గాలను ఎంపిక చేసి పవన్ పర్యటనను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పవన్ పాల్గొంటున్న బహిరంగ సభలకు ప్రజలు సైతం అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.
ఆదివారం బల్లార్ పూర్ బహిరంగ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనదైన శైలిలో తెలుగువారిని ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ప్రధానంగా తెలంగాణ ప్రజలు అధికంగా ఆ నియోజకవర్గంలలో నివసిస్తున్నట్లు తెలుసుకున్న పవన్.. బహిరంగ సభలో జై తెలంగాణ అంటూ నినదించారు. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన పవన్, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ పాటను అందుకున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ ఆ పాటను పాడుతున్నంత సేపు.. సభకు హాజరైన ప్రజలు చప్పట్లు మోగిస్తూ, కేరింతలతో హోరెత్తించారు. తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన ప్రజల గుండెల్లో మరాఠా శౌర్యాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నట్లు పవన్ కొనియాడారు.
అంతేకాదు కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహస్యం చేసే ప్రసంగాలను చేస్తారన్నారు. అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మంపై దాడి జరిగితే తాను ఖచ్చితంగా బయటకు వచ్చి పోరాడతానంటూ పవన్ హామీ ఇచ్చారు. తన ఇద్దరు పిల్లలతో తాను మరాఠీ భాషలో సైతం మాట్లాడతానని, భాష మీద గౌరవంతో తాను మరాఠీ నేర్చుకున్నట్లు పవన్ అనగానే.. సభకు హాజరైన ప్రజలు జై పవన్.. జై జై పవన్.. అంటూ నినదించారు.
Also Read: కాకినాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు.. అసలేం జరిగిందంటే?
కాగా పవన్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడంపై బీజేపీ అధిష్టానం సైతం పవన్ ను పొగడ్తలతో ముంచేస్తుందని సమాచారం. అలాగే తెలుగు వారిని దృష్టిలో ఉంచుకొని, పవన్ చేస్తున్న కామెంట్స్ తమకు కలిసి వస్తాయని బీజేపీ అంచనా. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధిస్తే అందులో పవన్ పాత్ర కూడా కీలకమేనంటున్నారు బీజేపీ నాయకులు. అయితే పవన్ ను రంగంలోకి దింపడంపై బీజేపీ తీసుకున్న నిర్ణయం సబబేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మహారాష్ట్ర ఎన్నికల అనంతరం పవన్ సభల ఎఫెక్ట్ ఎంత మేరకు ఉందో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ టాక్.