Pawan Kalyan: తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్ ను శనివారం డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి, సి, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్ అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మంగళంలోని ఎర్రచందనం గోడౌన్ ను పరిశీలించారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పవన్ కల్యాణ్ అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునూ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు.
Also Read: APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ