AP DSC Big TV Ban:ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 వ్యవహారం రోజురోజుకూ హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటికే డీఎస్సీ పరీక్షలు, ప్రశ్నపత్రం, అక్రమాల ఆరోపణలపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో.. ఈ వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్లపై చర్యలు తీసుకున్నారనే ప్రచారం ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది.
బిగ్ టీవీకి చెందిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్ అయ్యాయనే అంశంపై మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన శాఖ మంత్రి రాజన్నదొర స్పందించారు.
బిగ్ టీవీ ఎప్పుడూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకొచ్చే మీడియా సంస్థగా పనిచేస్తుందని రాజన్నదొర అన్నారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థ కాదని, ఎవరికీ తలొగ్గకుండా ప్రజల తరఫున మాట్లాడే ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాంటి మీడియా సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
డీఎస్సీ అంశంపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం వల్లే ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయా అన్న అనుమానాలు ఇపుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ నిబంధనల ప్రకారం ఖాతాలపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే అసలు ఎందుకు బ్లాక్ చేశారో సదరు సంస్థలు చెప్పాల్సి ఉంటుంది.ఇదే సమయంలో బిగ్ టీవీ అకౌంట్లపై చర్యల విషయంలో పారదర్శకత అవసరమని రాజన్నదొర అన్నారు.
ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతును ఆపే ప్రయత్నం జరగకూడదని ఆయన తెలిపారు. బిగ్ టీవీ సోషల్ మీడియా అకౌంట్లపై విధించిన బ్యాన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒక మీడియా సంస్థపై చర్యలు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కారణాలను స్పష్టంగా వెబయట పెట్టాలని . లేదంటే ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక ఈ వ్యవహారంలో అవసరమైతే కోర్టు వరకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని రాజన్నదొర తెలిపారు. న్యాయపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే వెనుకడుగు వేసేది లేదని అన్నారు. పైగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే బిగ్ టీవీ తరఫున న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని రాజన్నదొర చెప్పడం విశేషం.
ఇక బిగ్ టీవీపై జరుగుతున్న ఈ దాడులపై రాజకీయంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే మీడియా సంస్థలకు అండగా నిలవాలని అన్నారు. ఒకవైపు తమకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలను కాపాడుకుంటూ.. ప్రజల తరఫున ప్రశ్నించే మీడియాపై మాత్రం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నను ఆయన రైజ్ చేశారు.
మొత్తానికి బిగ్ టీవీపై బ్యాన్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకి దారి తీసింది.డీఎస్సీపై వచ్చిన కథనాల కారణంగానే ఈ చర్య జరిగిందా? లేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నిబంధనల ఉల్లంఘన కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటె మరోవైపు, బిగ్ టీవీ అకౌంట్లను తిరిగి పునరుద్ధరించాలంటూ రాజకీయ నేతలు, మీడియా వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అవసరమైతే ధర్నాలు, న్యాయపోరాటం వంటి కార్యక్రమాలకు కూడా సిద్ధమని రాజన్నదొర చేసిన కామెంట్స్ ఇపుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Also read :ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్
మొత్తానికి డీఎస్సీ వ్యవహారంతో మొదలైన చర్చ ఇప్పుడు మీడియా స్వేచ్ఛ, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ వంటి అంశాల వైపు మళ్లింది.చూడాలి మరి ముందు ముందు ఈ డీఎస్సీ-2025 వ్యవహారం ఇంకెన్ని మంటలు రాజేస్తుందో !