AP Govt Back Step on Land Allotment to Yatra Director: ఏపీలో ప్రముఖ టూరిజం కేంద్రం హార్సిలీహిల్స్. ఇక్కడ యాత్ర ఫిల్మ్ డైరెక్టర్ రాఘవకు కేటాయించిన భూమిని వైసీపీ ప్రభుత్వం వెనక్కితీసుకున్నట్లు సమాచారం. ఈ ల్యాండ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ క్రమంలో భూ కేటాయింపుపై వెనకడుగు వేసినట్టు సమాచారం.
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట మండలంలోని కోటావూరు గ్రామపరిధిలో దాదాపు నాలుగు ఎకరాల భూమి క్రీడా శిక్షణ కేంద్రానికి ఉండేది. దాన్ని రెండు భాగాలుగా చేసి రెండు ఎకరాల భూమిని మినీ స్టూడియో నిర్మించేలా రాఘవకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాజకీయ నేతలు, మీడియా రాద్దాంతం చేయడంతో ఓ అడుగు వెనుకేసింది.
యాత్ర 2 మూవీ తీయాలని భావించినప్పుడే ఫిల్మ్మేకర్ మహీ వి.రాఘవకు భూమిని కట్టబెట్టేందుకు జగన్ సర్కార్ వేగంగా పావులు కదిపిందనే ప్రచారం ఉంది. సుమారు 20 కోట్ల విలువ చేసే భూమిని డైరెక్టర్కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. త్రీ ఆటమ్ లీవ్స్ అనే సంస్థ యాత్ర 2 మూవీని నిర్మించింది. దీని వ్యవస్థాపకుడు మహీ వి. రాఘవ. రూరల్ మినీ స్టూడియో నిర్మిస్తానని ప్రభుత్వ పెద్దలతో ఆయన చెప్పినట్టు తెలిసింది. అందుకు హార్సిలీహిల్స్లో 10 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ గతేడాది జూన్ 17న ముఖ్యమంత్రి సీఎం జగన్కు లేఖ రాశారు.
Also Read: Purandeswari comments: అందుకోసమే త్రివేణి సంగమం.. అజెండా అదే..!
రాఘవ దరఖాస్తుపై హార్సిలీహిల్స్కు వెళ్లి స్థలాన్ని పరిశీలించాలని సీఎం కార్యదర్శి.. పర్యాటక శాఖను ఆదేశించారు. ఫిబ్రవరి 29న ఆ ఫైలు వ్యవహారం రెవెన్యూ శాఖ నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్కు వెళ్లింది. అక్కడ నుంచి అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. రాఘవకు కేటాయించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.
అసలు ల్యాండ్ హిస్టరీలోకి వెళ్తే.. హార్సిలీహిల్స్లో టూరిజం శాఖకు 20 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈ మేరకు 2018లో స్టోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు 3.74 ఎకరాలను కేటాయించింది. అయితే ప్రభుత్వం మారడంతో క్రీడా శిక్షణ కేంద్రం నిర్మాణ పనులు మరుగునపడ్డాయి.
మరోవైపు అసంపూర్తిగా ఉన్న క్రీడా శిక్షణ నిర్మాణ పనులను జులై మూడోవారంలోగా పూర్తి చేయాలని గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది. దీంతో పనులను పునర్ ప్రారంభించేందుకు అధికారులు దృష్టి పెట్టారు. క్రీడా శిక్షణ కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు కాగా, ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయల పనులు పూర్తి అయ్యాయి. వాటికి బిల్లులను సైతం చెల్లించినట్టు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది.