AP College Attendance New Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ను తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యార్థులు కేవలం కాలేజీకి వచ్చి వెళ్తే సరిపోదు.. వారి హాజరును కృత్రిమ మేధస్సు (AI)తో అనుసంధానించనుంది ప్రభుత్వం.
గతంలో కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు రాకపోయినా రిజిస్టర్లలో హాజరు వేయడం, లేదా ఒకరి బదులు మరొకరు అటెండెన్స్ వేయడం వంటి అక్రమాలు జరిగేవి. కొత్త ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల అటువంటి ‘డమ్మీ’ హాజరుకు పూర్తిగా చెక్ పడనుంది. విద్యార్థి స్వయంగా కెమెరా ముందు నిలబడితేనే హాజరు నమోదవుతుంది. ఈ డేటా నేరుగా ప్రభుత్వ సర్వర్లకు రియల్ టైమ్ లో అనుసంధానించబడి ఉంటుంది.
విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరవ్వడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా హాజరు విషయంలో ఇకపై మాయాజాలం చేసే అవకాశం ఉండదు. అధ్యాపకులు, విద్యార్థులు ఇద్దరూ సమయపాలన పాటించేలా ఈ వ్యవస్థ ఒత్తిడి పెంచుతుంది.
ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలకు హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉంటుంది. క్లాసులకు సరిగ్గా హాజరు కాని విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సాయం నిలిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా నిజమైన విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.
ఉన్నత విద్యామండలి ఈ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఏయే కాలేజీల్లో హాజరు శాతం తక్కువగా ఉంది? ఏ విద్యార్థులు వరుసగా గైర్హాజరవుతున్నారు? వంటి వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటాయి. సాంకేతికతను ఉపయోగించుకుని విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అలాగే ఫేక్ అటెండెన్స్ తో జరుగుతున్న నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: మార్కాపురం బస్సు ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..