Markapuram Accident Compensation: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుండి ఉదయగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో, గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే సుమారు 20 మంది సజీవదహనమయ్యారు.
ఈ భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మంత్రులందరూ నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. ప్రమాద తీవ్రతపై ఆరా తీసిన ముఖ్యమంత్రి.. తక్షణమే బాధితులకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని.. స్వయంగా మంత్రులు, ఉన్నతాధికారులు వైద్య చికిత్సను పర్యవేక్షించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి రవాణా, రహదారులు & భవనాలు, పోలీస్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రహదారి భద్రతపై పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. రాయవరం ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్గం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఇంధన కొరత లేదా ఇతర సాంకేతిక లోపాలు ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు.
మార్కాపురం రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద స్థలంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 5 కేజీల గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సుల్లో ఇటువంటి ప్రమాదకర వస్తువులను రవాణా చేయడం ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.