AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జరుగుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు, నేడు మరో కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలవడంతో ఈ వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అయితే విజయసాయి రెడ్డి ఈడీ విచారణ సందర్భంగా జగన్ కోటరీపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్లో అక్రమ లావాదేవీలు జరిగిన మాట వాస్తవమే అనిపించేలా ఆయన మాటలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారాలేవీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియవని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. కేవలం కొంతమంది కీలక నేతల కనుసన్నల్లోనే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆయన అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా, ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకే తాను రూ. 100 కోట్ల రూపాయలను రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు ఇప్పించానని విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలు మిథున్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి. లిక్కర్ స్కామ్లో నిధుల మళ్లింపు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది? ఎవరి ప్రమేయం ఎంత ఉంది? అనే విషయాలపై ఈడీకి విజయసాయి రెడ్డి స్పష్టమైన సమాచారం అందించినట్లు సమాచారం.
విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, ఈరోజు ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని టార్గెట్ చేయనున్నారు. ప్రధానంగా రూ. 100 కోట్ల చెల్లింపుల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సజ్జల శ్రీధర్ రెడ్డికి ఆ నిధులు చేరవేయడంలో మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి? అనే కోణంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచి ఈడీ విచారించనుంది.
Also Read: శ్రీరామ శోభాయాత్రలో అపశృతి.. కడుపులోకి దూసుకెళ్లిన టపాసు.. స్పాట్లో
ఈ విచారణల పరంపర వైసీపీలో అంతర్గత విభేదాలను బయటపెడుతోంది. విజయసాయి రెడ్డి నేరుగా మిథున్ రెడ్డి, సజ్జల వర్గాన్ని వేలెత్తి చూపడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఒకవేళ మిథున్ రెడ్డి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడితే, ఈ కేసులో మరికొంతమంది పెద్ద తలకాయలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.