Montha Cyclone: ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తుంది. తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మొంథా తుపాను ప్రభావంపై సచివాలయంలో మంత్రులు అనిత, లోకేశ్ , సీఎస్, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తుపాను వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్షించి తుపాను వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ బలగాలను మోహరించామని తెలిపారు. విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, డ్రెయిన్ల పునరుద్ధరణ, విరిగిపడ్డ చెట్లను తొలగించేలా యంత్రాలతో బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారన్నారు.
రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మొంథా తుపానుపై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం తుపాను కాకినాడకు 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 16 కి.మీ వేగంతో తుపాను తీరాన్ని సమీపిస్తుందని సీఎంకు వివరించారు. నేడు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రేపు రాత్రికి తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
ప్రతీ గంటకు తుపాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్ కు సీఎం సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
మొంథా తుఫాను ప్రభావంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు నిధులు విడుదల చేయడంతో పాటు 57 తీరప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. ప్రజలు ఈ షెల్టర్లను ఉపయోగించి సురక్షతంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఏపీపై తుపాను ప్రభావం మొదలైంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుంది. గడిచిన 6 గంటల్లో తుపాను గంటకు 18 కి.మీ వేగంతో కదిలింది. తుపాను ప్రస్తుతానికి చెన్నైకి 520 కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నానికి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
Also Read: Montha Cyclone: ఏపీపై ‘మొంథా’ తుపాను.. అలర్టయిన ప్రభుత్వం, పాఠశాలలకు సెలవులు
సోమవారం రాష్ట్రంలో అత్యధిక ప్రాంతంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, విశాఖ, కాకినాడ, కృష్ణ, బాపట్ల, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాలలో అతి భారీ వర్ష సూచన చేసింది. రేపు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్ష సూచనతో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఎల్లుండి కూడా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.