Satya Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మతపరమైన అంశాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. అమరావతి వేదికగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్వేషాలు రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు.
జగన్ వ్యాఖ్యలపై కౌంటర్..
గతంలో అమరావతి అని, ఆ తర్వాత మూడు రాజధానులని కాలక్షేపం చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సరికొత్తగా ‘మావిగన్’ అనే సరికొత్త, అసంబద్ధమైన వాదనను తెరపైకి తెచ్చారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అసలు మావిగన్ అంటే ఏంటో, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో జగన్ చెబితేనే ఆయనకే అర్థం కావాలని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో మూడు ప్రాంతాలలో దేనినీ అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు పొంతన లేని మాటలు మాట్లాడుతుంటే ప్రజలంతా గమనిస్తున్నారని హితవు పలికారు. హిందూత్వ మూలాలను దెబ్బతీసేలా జగన్ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని, అలాగే నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు కూడా సమాజంలో విద్వేషాలకు ఊతమిచ్చేలా ఉన్నాయని మండిపడ్డారు.
విద్వేషాలపై కఠిన చర్యలు..
రాష్ట్రంలో ప్రస్తుతం సానుకూల వాతావరణం ఉందని, దీనిని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని మంత్రి ఆరోపించారు. కులమతాల మధ్య విద్వేషాలు పెంచేలా కొందరు ప్రయత్నిస్తున్నారని, పక్క రాష్ట్రాల నుంచి సైతం వీడియో మెసేజ్లు పంపుతూ ఇక్కడి ప్రశాంతతను భంగపరిచే కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదనే విషయం అందరికీ తెలిసిందేనని స్పష్టం చేసిన ఆయన, చట్ట పరిధిలో ఇలాంటి మత విద్వేషాలు రేకెత్తిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూటమి తరఫున ప్రత్యేక ఆలోచనలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని తాము ముందుకు వెళతామని చెప్పారు. త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికలపై ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ, ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని మూడు పార్టీల అధినాయకత్వాలు త్వరలోనే సమన్వయంతో నిర్ణయిస్తాయని ఆయన స్పష్టం చేశారు.