Kova Bun: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటుచేసుకున్న కోవా బన్ రగడ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే ఒక చిరు వ్యాపారిపై రాజకీయ నాయకుడు వీరంగం సృష్టించడం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఆకివీడు వచ్చి.. వీధుల్లో తిరుగుతూ కోవా బన్ అమ్ముతున్నాడు. అయితే.. స్థానిక బీజేపీ నాయకుడు మాణిక్యం సదరు వ్యాపారిని నడిరోడ్డుపై అడ్డగించారు. వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఎక్కడ ఉందంటూ ప్రశ్నిస్తూ.. ఒక్కసారిగా అతడి కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారు.
ఈ క్రమంలో బీజేపీ నాయకుడు మాణిక్యం సంచలన ఆరోపణలు చేశారు. ఈ కోవా బన్లలో జిహాదీకి సంబంధించిన పదార్థాలు కలుపుతున్నారని.. అందుకే వీటిని ఇక్కడ విక్రయిస్తున్నారని ఆరోపించారు. తాను కర్నూలు నుంచి పొట్టకూటి కోసం వచ్చానని.. తనను వదిలేయమని ఆ వ్యాపారి ఎంత వేడుకున్నా మాణిక్యం వినలేదు. సదరు వ్యాపారి పట్ల జులుం ప్రదర్శిస్తూ అతడిని భయభ్రాంతులకు గురిచేశారు.
ఒక సామాన్య వ్యాపారిపై ఇలా అకారణంగా దాడి చేయడం.. మతపరమైన ఆరోపణలు చేయడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అమాయక వ్యాపారిపై ఈ జులుం ఏంటి? అని నాయకుడిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో.. స్థానికులే చొరవ తీసుకుని గొడవను సర్దుబాటు చేశారు. అనంతరం ఆ కోవా బన్ వ్యాపారిని అక్కడి నుండి సురక్షితంగా పంపించివేశారు.
Also Read: జాయాలుకాస్ షోరూమ్లో కిలో బంగారం చోరీ.. ఎలా దొరికాడో తెలుసా?