Kadiyam Srihari: మెజారిటీ స్థానాలు గెలుచుకొని చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మా బాధ్యత మరింత పెరిగిందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సోమవారం జరిగింది. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరితోనే అభివృద్ధి సాధ్యం అని నమ్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన మున్సిపాలిటీ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Rajasthan Fire: రాజస్థాన్లో ఘోర అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు సజీవదహనం
నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ పదవులతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధిపై మా బాధ్యత కూడా పెరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ప్రతీ వార్డుకు 2 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే వార్డుకు 50 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు. నూతనంగా గెలిచిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కౌన్సిలర్లు మీమీ వార్డులలో సమస్యలు గుర్తించాలని త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.