Veligonda Project: ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు కొత్త కళ వచ్చింది. కరువు పీడిత ప్రాంతాల ప్రజలు మూడు దశాబ్దాలుగా కన్న వెలిగొండ ప్రాజెక్టు కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆయన చేతుల మీదుగా తొలి దశ ప్రారంభం కానుంది. మూడు జిల్లాల ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు జీవనాధారంగా మారింది.
వెలిగొండ ప్రాజెక్టును ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయనుంది. ఈ ప్రాజెక్టుతోఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు కొత్త జలకళ మొదలైంది. శ్రీశైలం జలాశయం నుంచి కేవలం గ్రావిటీ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలించి నల్లమలసాగర్లో నిల్వచేయనున్నారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా సాగు-తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు. తొలి దశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేయనుంది ప్రభుత్వం. దీనిద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల జనాభాకు తాగునీరు అందనుంది.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 4.47 లక్షల ఎకరాల సాగునీరు, ఆయా జిల్లాల్లోని 30 మండలాలకు ప్రయోజనం చేకూరనుంది.
ఆదివారం వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణా జలాలు సొరంగం నుంచి బయటకు రావడంతో ఆ సమయంలో సైరన్ మోగించడం, అక్కడ వేచి ఉన్న జనం ఒక్కసారిగా ఈలలు, కేకలు, చప్పట్ల మోత మోగించారు. ఈ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద నిర్వహిస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన తర్వాత ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 48 రోజుల వ్యవధిలో సుమారు 6 వేల కుటుంబాలకు రూ. 768 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పంపిణీ చేసి పనుల్లో వేగం పెంచింది. అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారి కోసం అదనంగా మరో రూ. 169 కోట్లు కేటాయించింది. సోమవారం ఉదయం 9. 30 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మార్కాపురం జిల్లా గంటవానిపల్లికి చేరుకుంటారు. ఆ గ్రామం నుంచి రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. 10.35 నుంచి 11.20 వరకు ప్రత్యేక పూజలు చేసి ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించనున్నారు. చిరకాల గుర్తుగా అక్కడే పైలాన్ను ఆవిష్కరిస్తారు. ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి వెలిగొండకు కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. భారీ బహిరంగ సభ తర్వాత మధ్యాహ్నం 1.30కి అమరావతికి చేరుకుంటారు.
Also Read: పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!
వెలిగొండ ప్రాజెక్టు.. పూర్తయిన 30 ఏళ్ల స్వప్నం. #VeligondaProject pic.twitter.com/6lJCWmVXnV
— N Chandrababu Naidu (@ncbn) August 30, 2026