Ambati Rambabu: వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీలో ఆ రేంజ్లో కేసులు నమోదైన వ్యక్తి ఆయనే. తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని విషయంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యారు. ఏదో విధంగా నానారభస చేస్తూ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు నేతలు. ఆపై పోలీసులు కేసులు బుక్ చేయడం చకచకా జరిగిపోతోంది. ఈ విషయంలో అంబటి రాంబాబుపై దాదాపు అరడజను పైగానే కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ అధినేత జగన్ బయటకు వెళ్లిన చాలాసార్లు ఆయనపై కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. జగన్ గుంటూరు పర్యటన, సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు, ముద్రగడ అంత్యక్రియల్లో రసభ వంటివి ఉన్నాయి. తాజాగా అంబటిపై మరొక కేసు నమోదు చేశారు గుంటూరు సిటీ అరండల్ పేట పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా తన అధికారిక సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన అసత్యమైన, పరువు నష్టం కలిగించే వీడియోను పోస్టు చేశారట అంబటి రాంబాబు. అందులో జాతీయ చిహ్నాన్ని అవమానించే విధంగా డిజిటల్గా రూపొందించిన కార్టూన్ చిత్రాన్ని ఉపయోగించారట.
ఈ విధంగా సదరు మంత్రి పెమ్మసాని ప్రతిష్ఠను దెబ్బ తీయడం, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. పరిస్థితి గమనించిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అరండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.
ALSO READ: బెల్టు షాపు మురళి హత్య కేసులో సంచలనం, ప్రత్యక్ష సాక్షి కిడ్నాప్
మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను సంకెళ్లతో పోలీసులు తీసుకెళ్తున్నట్లు చూపించే ఏఐ-జనరేటెడ్ వీడియో రూపకల్పన, ప్రచారం, వైరల్ చేయడంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు వివిధ సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అరండల్పేట సీఐ వెల్లడించారు. వరుసగా అంబటిపై కేసులు నమోదు కావడంపై ఆ నేతలు షాకవుతున్నారు.