Ponguru Narayana: నెల్లూరు నగరంలోని చెత్త పాయింట్ల వద్ద అగ్నిప్రమాదాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘాటుగా సమాధానమిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలవన్నీ నియామకం లేని చెత్త ఆరోపణలని, కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అజ్ఞానంతోనే వైఎస్ఆర్సీపీ విమర్శలు
చెత్త కుప్పల్లో సహజంగానే బయోగ్యాస్ తయారవుతుందని.. అందులో 65 శాతానికి పైగా మిథేన్ ఉండటం వల్లే స్వయంచాలకంగా మంటలు చెలరేగుతాయని మంత్రి శాస్త్రీయంగా వివరించారు. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా, చదువుకున్న నాయకులు కూడా ‘చెత్తను తగలబెడుతున్నారు’ అని అజ్ఞానంతో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. క్షేత్రస్థాయి నిజాన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే
తనపై అనవసర అవినీతి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని నారాయణ తేల్చిచెప్పారు. ‘నాకు డబ్బే సంపాదించాలనుకుంటే నారాయణ విద్యాసంస్థలను చూసుకుంటే చాలు. 2019లో రూ.2,500 కోట్లుగా ఉన్న విద్యాసంస్థల టర్నోవర్ను 2024 నాటికి రూ.6,500 కోట్లకు పెంచి, నిర్వహణను పిల్లలకు అప్పగించాను’ అని స్పష్టం చేశారు.
పేదల ఇళ్లకు శాశ్వత పట్టాల పంపిణీ..
స్వయంగా పేదరికం నుంచి వచ్చినవాడిగా పేదల కష్టాలు తనకు బాగా తెలుసని, కేవలం ప్రజాసేవ లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను శాశ్వత ఆస్తిగా అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, పేదల ఇళ్లకు శాశ్వత పట్టాల పంపిణీ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి!