Gudur Transformer: నెల్లూరు జిల్లా గూడూరు రాజకీయంలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన రామలింగాపురంలో వెలుగు చూసింది. అర్థరాత్రి వేళ జరిగిన ఈ విషాదం వెనుక ఏం జరిగిందనే అంశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్థరాత్రి విద్యుత్ షాక్.. ఇద్దరి మృతి
గూడూరు మండలం రామలింగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మృతదేహాలై పడి ఉండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురికావడంతోనే వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
చోరీ ముఠా పనేనా?
ఘటనా స్థలంలో ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని రిజిస్ట్రేషన్ను పరిశీలించగా.. అది ఓజిలి మండలం సగుటూరుకు చెందిన ఒక మహిళ పేరుతో ఉన్నట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి, వాటిలోని విలువైన రాగి వైర్లను ఎత్తుకెళ్తున్న ముఠాలపై ట్రాన్స్కో అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా రాగి వైర్లు చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తూ షాక్కు గురయ్యారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
పోలీసుల దర్యాప్తు తీవ్రం
చనిపోయిన వ్యక్తులు ఎవరు? నిజంగానే వారు వైర్ల చోరీకి వచ్చారా? లేక దీనివెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలంలోని ఆధారాలను సేకరిస్తూ మృతుల గుర్తింపు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు.
Also Read: జీహెచ్ఎంసీ రూటే సెపరేటు.. అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?